Godavari Flood: మళ్లీ ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి.. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ..
జులై నెలలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద 70అడుగుల మేర వరదనీరు ప్రవహిస్తూ గోదావరి పరివాహక ప్రాంతాలను ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.
- Harishth Thanniru
- Published On : August 10, 2022 / 09:38 AM IST
Godavari Flood: జులై నెలలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద 70అడుగుల మేర వరదనీరు ప్రవహిస్తూ గోదావరి పరివాహక ప్రాంతాలను ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. వారంరోజుల పాటు గోదావరి ఉగ్రరూపం కొనసాగగా.. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో క్రమంగా గోదావరి నీటిమట్టం తగ్గుకుంటూ వచ్చింది. గోదావరి తగ్గుముఖం పట్టడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న పరివాహక ప్రాంతాల ప్రజలను మళ్లీ గోదావరి భయపెడుతోంది.
భద్రాచలం వద్ద గోదావరి వరద మళ్లీ పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి పోటెత్తుతున్న వరద కారణంగా బుధవారం ఉదయం 5గంటలకు 49.3 అడుగుల వద్ద ఉన్న నీటిమట్టం ఉదయం 7గంటల సమయానికి 49.8 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి నదిలో 12లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తుంది. నీటిమట్టం 53 అడుగులు దాటితే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు.
Godavari Flood : పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి-భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
ప్రతీయేటా ఆగస్టులో గోదావరి ఉధృతి కొనసాగుతోంది. ఈసారి జులై నెలలోనే గోదావరికి వరద పోటెత్తింది. తాజాగా మళ్లీ గోదావరిలో వరద నీరు ప్రవాహం పెరుగుతోంది. ఇదిలాఉంటే గోదావరి పరివాహక ప్రాంతాల అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు, సారపాక, అశ్వారావుపేట, పినపాక, ఏడూళ్ల బయ్యారం తదితర గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. గోదావరిలో వరదనీరు పెరిగే పక్షంలో పునరావాస కేంద్రాలకు తరలిరావాలని సూచించారు.
