Munugodu By-Election Left Parties : మునుగోడు ఉప ఎన్నికపై వామపక్షాలు కసరత్తు మొదలు పెట్టాయి. అభ్యర్థిని నిలబెట్టడమా ? లేక మరో పార్టీకి మద్దతివ్వడమా ? అనేదానిపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మునుగోడు నియోజకవర్గ సీపీఐ ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. చండూరులోని సీపీఐ కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఆరు మండలాల కార్యదర్శులు, కౌన్సిల్ సభ్యులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఉప ఎన్నికలో పార్టీ అనుసరించాల్సిన వైఖరిపై స్థానిక నేతలు తమ అభిప్రాయాలు చెబుతున్నారు.
పార్టీ తరపున అభ్యర్థిని నిలబెట్టాలా? టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలా? కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలా?..ఈ మూడు ఆప్షన్లను చాడ వెంకటరెడ్డి స్థానిక నేతల ముందు ఉంచారు. టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చేందుకే మునుగోడు నియోజకవర్గ సీపీఐ నేతలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 19, 20 తేదీల్లో జరిగే సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.