Today HeadLines : అనకాపల్లి ఎంపీ స్థానంపై అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు
ఉన్నత చదువులు చదివాడని, తెలుగు-ఇంగ్లీష్-హిందీ అనర్గళంగా మాట్లాడతాడని చెప్పారు. అర్హతను చూసి సీటు ఇవ్వాలని కోరారు.
అనకాపల్లి ఎంపీ స్థానంపై అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు
అనకాపల్లి ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నది తన కొడుకు సొంత నిర్ణయం అని, అందులో తన ప్రమేయం ఏమీ లేదని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. తన కుమారుడికి ఎంపీగా పోటీ చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపారు. ఉన్నత చదువులు చదివాడని, తెలుగు-ఇంగ్లీష్-హిందీ అనర్గళంగా మాట్లాడతాడని చెప్పారు. అర్హతను చూసి సీటు ఇవ్వాలని కోరారు. ఒకే కుటుంబంలో రెండు సీట్లు ఇవ్వకూడదని చంద్రబాబు అనుకుంటే.. తనకు కాకుండా తన కొడుక్కే టికెట్ ఇవ్వాలని కోరతానని అన్నారు అయ్యన్నపాత్రుడు.
బాపట్ల జిల్లా మార్టూరులో గ్రానైట్ ఫ్యాక్టరీల్లో సోదాలు
బాపట్ల జిల్లా మార్టూరులోని గ్రానైట్ ఫ్యాక్టరీలలో విజిలెన్స్, మైనింగ్, లీగల్ మెట్రాలజీ అధికారులు సోదాలు జరిపారు. ఫ్యాక్టరీ యజమానులకు టీడీపీ ఎమ్మెల్యే సాంబశివరావు మద్దతు తెలిపారు. టీడీపీ సానుభూతిపరుల ఫ్యాక్టరీలలో దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డర్స్ లేకుండా ఎలా తనిఖీలు చేస్తారని ప్రశ్నించారు. అధికారుల వెంట కొంతమంది వైసీపీ శ్రేణులు వచ్చారని, తమపై దాడి చేసేందుకు కారంపొడి ప్యాకెట్లు తీసుకొచ్చారని ఆరోపించారు.
గన్నవరం ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం
కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్ పోర్టులో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్ సమయంలో ల్యాండింగ్ వీల్ ఓపెన్ కాకపోవడంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని గాల్లోలోనే మూడుసార్లు చక్కర్లు కొట్టించారు. అనంతరం తిరిగి ల్యాండ్ అవుతుండగా.. ల్యాండింగ్ వీల్ ఓపెన్ కావడంతో విమానం సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. ఆ సమయంలో విమానంలో మాజీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఉన్నారు.
నితీశ్ కుమార్ బీజేపీ ఉచ్చులో చిక్కుకున్నారు
ఎన్డీయే పాలనలో సామాజిక న్యాయం లేదన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. దళితులు, గిరిజనులకు అన్యాయం జరుగుతోందని వాపోయారు. బీహార్ లో నితీశ్ అవసరం లేదన్నారాయన. నితీశ్ కుమార్ బీజేపీ ఉచ్చులో చిక్కుకున్నారని కామెంట్ చేశారు రాహుల్ గాంధీ.
30గంటల తర్వాత ప్రత్యక్షమైన సీఎం
30 గంటలుగా కనిపించకుండా పోయిన జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ రాంచీలో ప్రత్యక్షం అయ్యారు. ఈడీ అధికారులు నిన్నటి నుంచి ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఆయన నివాసంలో డబ్బు కట్టలు కూడా స్వాధీనం చేసుకున్నారు. హేమంత్ ఏమయ్యారు? అనేదానిపై సమాచారం లేకపోవడంతో అధికార కూటమిలో అయోమయం నెలకొంది. కానీ, మధ్యాహ్నాం సమయంలో సడెన్ గా కారులో కూర్చుని చెయ్యి ఊపుతూ రాంచీలో కనిపించారు సోరేన్.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్ వేసింది. ఎమ్మెల్సీల పిటిషన్ పై హైకోర్టు తీర్పు ఇచ్చింది. స్టేటస్ కో ఆర్డర్ పాస్ చేసింది హైకోర్టు. దీంతో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఫిబ్రవరి8 కి వాయిదా వేసింది న్యాయస్థానం.
ఇమ్రాన్ ఖాన్కు 10 ఏళ్ల జైలు శిక్ష
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు బిగ్ షాక్ తగిలింది. అధికారిక రహస్యాలను వెల్లడించిన కేసులో కోర్టు ఆయనకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఖురేషీకి కూడా పదేళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు పీటీఐ అధికారిక ప్రతినిధి వెల్లడించారు.
మాల్దీవులు టూరిజం ర్యాంకింగ్స్..
భారత్- మాల్దీవుల మధ్య నెలకొన్న దౌత్యపరమైన వివాదం తరువాత మాల్దీవులకు వెళ్లే భారతీయుల సంఖ్య వారాల వ్యవధిలో గణనీయంగా పడిపోయింది. గతంలో మాల్దీవుల విదేశీ పర్యాటకంలో అగ్రస్థానంలో ఉండే భారత్ ఇప్పుడు ఐదో స్థానానికి పడిపోయింది. మాల్దీవులు పర్యాటక శాఖ విడుదల చేసిన తాజా డేటా వివరాల ప్రకారం.. డిసెంబర్ 2023లో అగ్రస్థానంలో ఉన్న భారత్ ప్రస్తుతం ఐదో స్థానానికి దిగజారిపోయింది. 2024 జనవరి 28 నాటికి మాల్దీవులు టూరిజంతో భారత్ వాటా కేవలం 8 శాతం ఉండగా చైనా 9.5శాతం, యూకే 8.1శాతం వాటాను కలిగి ఉన్నాయి.
బీజేపీ నేత హత్య కేసులో 15 మందికి మరణశిక్ష
బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో 15 మంది పీఎఫ్ఐ కార్యకర్తలకు మరణశిక్ష విధించింది కేరళలోని అలప్పుళ కోర్టు. పీఎఫ్ఐ, ఎస్డీపీఐ కార్యకర్తలు 2021 డిసెంబరు 19న అలప్పుళలో రంజిత్ ఇంట్లోకి చొరబడి కుటుంబసభ్యుల ఎదుటే అతి కిరాతకంగా అతడిని హతమార్చారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా తీర్పు వెల్లడించింది.
కరెంటు చార్జీను పెంచుతారా?
ఏపీలో విద్యుత్ వినియోగదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని రాష్ట్ర డిస్కంలు తీసుకున్నాయి. రాబడి, వ్యయాలు సమానంగా ఉండడంతో వినియోగదారులు, పరిశ్రమలకు ఈ ఏడాది పాత టారిఫ్లే కొనసాగనున్నట్లు వెల్లడించాయి. రైల్వేకు అందిస్తున్న విద్యుత్ ఛార్జీలపై యూనిట్కు రూ.1, గ్రీన్ పరవ్ కేటగిరీలో 75 పైసల నుంచి రూపాయికి పెంచేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీఈఆర్సీని కోరాయి. వీటికి త్వరలోనే ఆమోదం లభించనుంది.
గంజాయి చాక్లెట్ల కలకలం
ఖమ్మంలో గంజాయి చాక్లెట్ల కలకలం రేగింది. గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి మూడు కేజీల గంజాయి చాక్లెట్లు, 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
మనిషి మెదడులో చిప్
మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ను అమర్చే ప్రయోగాల్లో కీలక అడుగు పడింది. సోమవారం మొదటిసారి ఓ వ్యక్తికి విజయవంతంగా చిప్ను అమర్చామని న్యూరాలింక్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ తెలిపారు. అతడు చాలా వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడించారు. ఆరంభ ఫలితాల్లో స్పష్టమైన ‘న్యూరాన్ స్పైక్ డిటెక్షన్’ను గుర్తించినట్లు చెప్పారు. కాగా.. న్యూరాలింక్ చిప్ను ఇప్పటికే పందులు, కోతుల్లో విజయవంతంగా పరీక్షించారు.
నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నేటి నుంచి రెండు రోజుల పాటు చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర చేపట్టనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం పర్చూరు, దర్శి, ఒంగోలు ప్రాంతాల్లో, బుధవారం కందుకూరు, కొండపీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్టులతో కలత చెంది మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్నారు.
గన్నవరం ఎయిర్ పోర్టులో దట్టమైన పొగమంచు
కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. రన్ వేను దుప్పటిలా పొగమంచు కప్పేసింది. దీంతో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విమానాల టేకాఫ్, ల్యాండింగ్లకు ఇబ్బంది కలుగుతుంది. షార్జా నుంచి గన్నవరం వచ్చిన ఇండిగో విమానం గాలిలో చక్కర్లు కొడుతోంది.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కేఏ పాల్
హైదరాబాద్లో గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమ్మిట్ను నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. తెలంగాణలో అక్టోబర్ 2న పెట్టుబడులను ఆహ్వానించే దిశగా గ్లోబల్ పీస్ అండ్ ఎకనామిక్ సమ్మిట్ ను నిర్వహించానున్నామని పాల్ చెప్పారు. ఇందుకు ప్రభుత్వం సహకరించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డిని కలిశామన్నారు. ఈ సమ్మిట్ నిర్వహించేందుకు సీఎం అంగీకరించారని, అంతేగాక ప్రభుత్వ సహకారం కూడా అందిస్తామని హామీ ఇచ్చారని పాల్ తెలిపారు.
రెండో టెస్టుకు జడేజా, రాహుల్ దూరం
ఇంగ్లాండ్తో విశాఖ వేదికగా జరగనున్న రెండో టెస్టు మ్యాచుకు ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు మిడిల్ ఆర్డర్ ఆటగాడు కేఎల్ రాహుల్ గాయాలతో దూరం అయ్యారు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్, సౌరవ్కుమార్, ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్లను సెలక్టర్లు ఎంపిక చేశారు.
ఆర్ధిక శాఖపై నేడు సీఎం జగన్ సమీక్ష
ఆర్థికశాఖపై నేడు(మంగళవారం) సీఎం జగన్ సమీక్ష చేపట్టనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉదయం 11.30 గంలకు సమీక్ష నిర్వహించనున్నారు. వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలు నేపథ్యంలో నేటి సమీక్షకు ప్రాధాన్యత సంతరించుకుంది.