Balakrishna and Vijayasai Reddy doing all works at Tarakaratna home and last rites
Balakrishna-Vijayasai Reddy : తెలుగు సినీపరిశ్రమలో గత కొద్దికాలంగా వరుసగా పలువురు ప్రముఖులు మరణిస్తూ విషాదాన్ని మిగిల్చారు. తాజాగా నటుడు నందమూరి తారకరత్న గత కొన్ని రోజులుగా బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ శనివారం(ఫిబ్రవరి 18)న రాత్రి కన్నుమూశారు. దీంతో మరోసారి సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. సినీ పరిశ్రమతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తారకరత్న మృతిపై సంతాపం తెలియచేస్తున్నారు.
శనివారం నాడు హైదరాబాద్ దగ్గర్లోని మోకిలలోని తారకరత్న స్వగృహం వద్ద ఆయన భౌతికకాయం ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. నేడు ఉదయం నుండి తారకరత్న భౌతికకాయం ఫిలింఛాంబర్ లో ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. దీంతో భారీ సంఖ్యలో అభిమానులు, టిడిపి కార్యకర్తలు వచ్చి ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. నేడు సాయంత్రం మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఇక ఈ కార్యక్రమాలన్నీ బాలకృష్ణ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గరుండి చూసుకుంటున్నారు. బాలకృష్ణ, తారకరత్న మధ్య బాబాయ్-అబ్బాయిగా చాలా మంచి అనుబంధం ఉంది. దీంతో తారకరత్న అటు హాస్పిటల్ లో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు మరణించిన తర్వాత కానీ అన్నీ పనులు దగ్గరుండి చూసుకున్నారు బాలయ్య బాబు. ఇక తారకరత్న భార్య అలేఖ్యరెడ్డికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గరి బంధువు అవడంతో శనివారం నుంచి తారకరత్న ఇంటివద్దే ఉంటూ అన్ని కార్యక్రమాల్లోనూ పాలు పంచుకుంటున్నారు. దీంతో బాలకృష్ణ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిసి అక్కడ అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Tarakaratna : ఫిలిం ఛాంబర్లో తారకరత్న పార్థివ దేహం.. అభిమానులు, ప్రముఖుల నివాళులు, లైవ్ అప్డేట్స్
అయితే పార్టీల పరంగా ఇద్దరూ శత్రుత్వం చూపించినా, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. అలాంటి వీరిద్దరూ నేడు తారకరత్న కోసం ఒక్కటై దగ్గరుండి అన్నీ తామై పనులు జరిపిస్తున్నారు. ఆ కుటుంబానికి పక్కనే ఉంటూ భరోసా ఇస్తున్నారు. తారకరత్న అంత్యక్రియలు నిర్వహించేవరకు పక్కనే ఉండే వీరిద్దరూ అన్ని కార్యక్రమాలు చూసుకోనున్నారు. దీంతో పార్టీ పరంగా ఎన్ని ఉన్నా, ఇలా కుటుంబం కోసం ఒక్కటై నిలబడటంతో అందరూ వీరిద్దర్నీ అభినందిస్తున్నారు.