Balakrishna Speech in Bhagavanth Kesari Movie Trailer Launch Event
Balakrishna : అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో బాలకృష్ణ (Balakrishna) హీరోగా తెరకెక్కుతున్న సినిమా భగవంత్ కేసరి(Bhagavanth Kesari). బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) నటిస్తోండగా శ్రీలీల(Sreeleela) బాలయ్య బాబుకి కూతురి పాత్రలో కనిపించనుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్గా కనిపించనున్నాడు. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
తాజాగా నేడు భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వరంగల్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి బాలకృష్ణ, కాజల్, శ్రీలీల, చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు. ఈవెంట్ కి బాలయ్య అభిమానులు, ప్రేక్షకులు చాలా మంది వచ్చి సందడి చేశారు. ఇక ఈ ఈవెంట్లో బాలకృష్ణ సినిమా గురించి, ఎన్టీఆర్ గురించి, అభిమానుల గురించి, సినిమాలకు ప్రభుత్వాలు సహకరించాలని మాట్లాడారు.
బాలకృష్ణ మాట్లాడుతూ.. నేను రోజూ తారాబలం చూసుకుంటాను. ఇవాళ పుష్యమి నక్షత్రం దుర్గమ్మని పూజించాలి. ఇంట్లో పూజించాను. ఇక్కడ భద్రకాళి అమ్మవారు ఉన్న ఈ వరంగల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం కాకతాళీయం. మొదటిసారి నేను తెలంగాణ మాండలికంలో నటించాను. ట్రైలర్ లో చూసింది కొంచెమే. లోపల ఇంకా దాచిపెట్టాం. సినిమా రిలీజ్ కి ముందు మీకు సినిమా నుంచి ఇంకో సర్ ప్రైజ్ ఇస్తాను. ఒక సినిమా చేసేటప్పుడు అంతకుముందు సినిమాల గురించి మాట్లాడాను, ఆలోచించను. అనిల్ రావిపూడి సినిమా చేసేటప్పుడు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. మొదటి సినిమా పటాస్ లో నా పాట వాడుకున్నాడు చెప్పకుండా, సరదాగా ఉంటాడు ఏ సీన్ లో అయినా. నేను కొట్టడం, తిట్టడం గురించి మాట్లాడతారు. కానీ అప్పుడప్పుడు అలాంటివి జరగాలి. ఎందుకు జరిగాయో తెలుసుకోవాలి. సాయం చేసే చేతుల గురించి కూడా తెలియాలి. కోపం ఎక్కువ ఉన్నవాళ్లు మంచోళ్ళు. శ్రీలీల ఈ సినిమాలో కూతురిగా చేసింది. తర్వాత సినిమాల్లో హీరో హీరోయిన్స్ గా చేద్దాం అని సరదాగా అన్నాను. తర్వాత అది మా ఇంట్లో చెప్తే మోక్షజ్ఞకి కోపం వచ్చింది. నేను కుర్ర హీరోని రాబోతున్నాను, నువ్వేమో ఈ అమ్మాయికి ఆఫర్ ఇస్తావా అని తిట్టాడు. నన్నే తిట్టాడు అని అనుకున్నాను. తమన్ గురించి చెప్పాలి. నా సినిమా వస్తే ఆయనకి పూనకం వస్తుంది. సినిమా థియేటర్స్ లో నోటీసులు పెడతారు సౌండ్ పెంచాము అని. అయినా అభిమానులు ఊరుకోరు. అలాంటి అభిమానులు ఉండటం నా అదృష్టం. డైరెక్టర్ – కెమెరామెన్ – ఎడిటర్ సినిమాకు ఈ ముగ్గురు ప్రాణం. ఈ సినిమా చూసి ఆడవాళ్ళతో పాటు మగాళ్లు కూడా కన్నీళ్లు పెట్టుకొని బయటకి వస్తారు. అంత ఎమోషనల్ గా ఉంటుంది సినిమా అని అన్నారు.
Also Read : Balakrishna : అఖండ సినిమాకు ప్రభుత్వాలు సహకరించలేదు.. సినిమాలు కూడా ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇస్తాయి..
అలాగే అఖండ సినిమా అప్పుడు ప్రభుత్వాలు సహకరించలేదు. ఎక్స్ ట్రా షోలు లేవు, రేట్లు పెంచలేదు. సినిమాలకు ప్రభుత్వాలు సహకరించాలి. సినిమాల నుంచి ఆదాయం వస్తుంది అని అన్నారు. అలాగే మధ్య మధ్యలో డైలాగ్స్, ఎన్టీఆర్ గురించి, తెలంగాణ, ఇక్కడి ప్రముఖుల గురించి మాట్లాడారు బాలయ్య. దీంతో బాలయ్య స్పీచ్ వైరల్ గా మారింది.