Chiranjeevi: ముదురుతున్న ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ వివాదం.. రంగంలోకి చిరంజీవి.. ‘పెద్ది’కి లైన్ క్లియర్ అయ్యేనా?
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) వద్దకు వెళ్లనున్న టాలీవుడ్ ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ వివాదం.
- V Santhosh Kumar
- Published on- May 13, 2026 / 07:00 PM IST
Exhibitors and Producers to Approach Megastar chiranjeevi on latest tollywood issue
- ఎగ్జిబిటర్ల నిర్ణయంపై నిర్మాతల ఆగ్రహం.
- పెద్ది మూవీపై బ్లాక్మెయిలింగ్ ఆరోపణలు.
- రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ.
Chiranjeevi: తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ కోసం ఎగ్జిబిటర్లు ప్రకటించిన “పర్సెంటేజ్ షేరింగ్” నిర్ణయం టాలీవుడ్లో పెద్ద దుమారాన్నే రేపింది. కేవలం ఈ విధానానికి అంగీకరించే చిత్రాలనే ప్రదర్శిస్తామన్న ఎగ్జిబిటర్ల ప్రకటనపై యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీవ్రంగా స్పందించింది. సినిమా అనేది ఒక ఎకో సిస్టమ్ అని, కేవలం ఒక వర్గం ప్రయోజనాల కోసం తీసుకునే నిర్ణయాలు ఇండస్ట్రీని దెబ్బతీస్తాయని నిర్మాతలు రవిశంకర్, నాగవంశీ తదితరులు ప్రెస్ మీట్ లో అసహనం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో ఈ డిమాండ్లు తీసుకురావడంపై నిర్మాతలు మండిపడ్డారు. గతంలో పెద్ద సినిమాలు వచ్చినప్పుడు లేని కష్టాలు, ఇప్పుడు ‘పెద్ది’ సమయానికే ఎందుకు వచ్చాయని వారు ప్రశ్నించారు. ఇది ఒకరకమైన బ్లాక్ మెయిలింగ్ అని, భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమాల విషయంలో ఇలాంటి ఒత్తిళ్లు తగవని నిర్మాత రవిశంకర్ స్పష్టం చేశారు. అడిగిందల్లా ఇచ్చుకుంటూ పోతే నిర్మాతలు నిలదొక్కుకోవడం కష్టమని ఆయన హెచ్చరించారు.
ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తుండటంతో, పరిశ్రమ పెద్దగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) రంగంలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య సమన్వయం కుదిర్చి, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. మరి చిరంజీవి ఎంట్రీతో ఈ ‘పర్సెంటేజ్’ రచ్చ సర్దుమణిగి ‘పెద్ది’ వంటి భారీ చిత్రాలకు లైన్ క్లియర్ అవుతుందా, ఇంకా ఈ వివాదం అలాగే కొనసాగుతుందా అనేది చూడాలి.
