Ranu Mondal: సోషల్ మీడియా సెన్సేషన్ రణు మండల్ (Ranu Mondal) మళ్లీ యధాస్థితికి చేరుకుంది. ఒకే ఒక్క పాటతో ఇంటర్నెట్లో సంచలనం సృష్టించిన గాయనిగా ఆమె పేరు దేశం మొత్తం మార్మోగిపోయింది.
బెంగాల్లోని రాణాఘాట్ రైల్వేస్టేషన్ వద్ద యాచకురాలుగా ఉన్న రణు.. లతా మంగేష్కర్ పాడిన పాటను ఒక నెటిజన్ వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయడంతో.. బాలీవుడ్లో అవకాశాలు మంచి అవకాశాలు వచ్చాయి. పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు.. అన్నీ వచ్చాయి.
బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేశ్ రేష్మియా (Himesh Reshammiya) తాను నటించి కంపోజ్ చేసిన ‘తేరీ మేరీ కహానీ’లో ఆమె చేత మూడు పాటలు పాడించారు. హిమేష్తో కలిసి ఆమె పాడిన పాట.. ‘తేరీ.. మేరీ.. తేరి మేరి కహానీ’ పాట ఒక ఊపు ఊపింది.
over Night Star అయిన రణు మండల్ అంతకుముందు ఆమె ఇంటిని మార్చి కొత్త ఇళ్లు కొంది. ఫంక్షన్లకు వెళ్లే సమయంలో ఆమె వేసుకున్న మేకప్ చూసి నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇక తనను సెల్ఫీ అడిగిన ఒక అభిమానిపై ఆమె వ్యవహరించిన తీరు కూడా వివాదాస్పదమైంది.
అడపా దడపా అవకాశాలు వచ్చినా.. ఇదే క్రమంలో దేశంలో కరోనా రాకతో దేశం Lockdown అయింది. రణుకు సినిమాలు లేవు. షో లు లేవు. డబ్బు లేదు. తిరిగి వెళ్దామా అంటే వెళ్లలేని పరిస్థితి. తనకొచ్చిన ఫేమ్ కారణంగా కరోనా కాలంలో కొంతమంది పేదలకు బియ్యం, సరుకులు సాయం చేసింది. కానీ రాను రాను ఉన్న డబ్బులు అయిపోసాగాయి.
పని చేస్తేనే కానీ పూట గడవని పరిస్థితి.. తనకంటూ సొంత ఆస్తులేమీ లేవు. కట్ చేస్తే ఆమె మళ్లీ యథాస్థితికి చేరుకుంది. తను ఇచ్చిన బిల్డప్ కారణంగా ఆమె దగ్గరకు రావడానికి కానీ సాయం చేయడానికి కానీ ఎవరూ సాహసించడం లేదు. తన ప్రవర్తన కారణంగా ఎక్కడ మొదలైందో మళ్లీ అక్కడికే చేరుకుంది రణు మండల్.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి.. ఈ విషయాన్ని మర్చిపోయిన వారు ఎంతటివారైనా తిరిగి పూర్వ స్థితికి చేరుకుంటారు అని పెద్దలు చెప్పిన మాట రణు విషయంలో అక్షరాలా నిజమైంది. తాటికాయంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి మరి.