లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ

రాంగోపాల్ వర్మ. కాంట్రవర్సీ కథలతో రిలీజ్ కంటే ముందే హైప్ తీసుకొస్తారు. కొన్ని హిట్.. మరికొన్ని అట్టర్ ఫ్లాప్. ఇలాంటి టైంలోనే రాజకీయాలతో మిక్స్ అయ్యి.. ఎన్టీఆర్ నిజ జీవితంలో లక్ష్మీపార్వతి పాత్రతో తెరకెక్కించిందే లక్ష్మీస్ ఎన్టీఆర్. వివాదాల మధ్య ఏపీలో కాకుండా తెలంగాణ విడుదల అయ్యింది. మూవీ ఎలా ఉంది.. కుట్రను చూపించారా.. లక్ష్మీపార్వతి విలనా.. చంద్రబాబు వెన్నుపోటు అంశం.. తండ్రితో నందమూరి కుటుంబ సభ్యులు ఎలా ప్రవర్తించారు అనేది సినిమాలో ఎలా చూపించారో రివ్యూలో చూద్దాం..
కథ :
లక్ష్మీస్ ఎన్టీఆర్ కొత్త కథేం కాదు. అందరికీ తెలిసిందే. 1989లో ఎన్టీఆర్ అధికారం కోల్పోయిన సమయంలో ఒంటరిగా ఉన్న ఎన్టీఆర్ దగ్గరకు ఆయన జీవిత చరిత్ర రాసేందుకు లక్ష్మీపార్వతి ఎంట్రీ ఇస్తుంది. ఉన్నత చదువులు చదువుకున్న ఆమె గురించి తెలుసుకున్న ఎన్టీఆర్.. జీవిత చరిత్ర రాసేందుకు అనుమతి ఇస్తాడు. అలా ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన లక్ష్మీ పార్వతిపై కొద్ది రోజుల్లొనే నెగెటివ్ ప్రచారం మొదలవుతుంది. ఆ ప్రచారం ఎన్టీఆర్ దాకా రావటంతో.. మేజర్ చంద్రకాంత్ సినిమా ఫంక్షన్లో పెళ్లి చేసుకోబోతున్నట్లు పబ్లిక్ గా ప్రకటిస్తారు. ఎన్టీఆర్ అల్లుడు, ఓ పత్రికా అధినేతతో కలిసి లక్ష్మీ పార్వతిపై చెడు ప్రచారం మొదలు పెడతాడు. 1994లో లక్ష్మీతో కలిసి ప్రచారం చేసిన ఎన్టీఆర్ భారీ మెజారిటీ సీఎం అవుతారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు.. కుటుంబాన్ని తనవైపు తిప్పుకున్న అల్లుడు.. కుట్రలకు తెరతీస్తాడు. కుటుంబ సభ్యులను బెదిరించి తనవైపు తిప్పుకుని ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడుస్తారు. సీయం కుర్చీ లాక్కుంటాడు. పదవి కోల్పోయి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఎన్టీఆర్పై వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులు వేయటంతో కుమిలి కుమిలి చనిపోతాడు. ఇదే లక్ష్మీస్ ఎన్టీఆర్ కథ..
నటీనటులు ;
ఎన్టీఆర్ పాత్రలో కనిపించిన విజయ్ కుమార్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. వర్మ పెట్టుకున్న నమ్మకాన్ని నెలబెట్టాడు. సెంటిమెంట్ సీన్లలో బాగా ఫెర్మార్మెన్స్ చేశాడు. ఆ బాడీ లాంగ్వేజ్, విశ్వ చెప్పిన డబ్బింగ్ వాయిస్ సేమ్ ఎన్టీఆర్ ను తలపించేలా ఉన్నాయి. కొత్త నటుడు అయినా.. ఏ మాత్రం తడబాటు లేకుండా నటించటం విశేషం. మరో కీలక పాత్రలో నటించిన యజ్ఞశెట్టి.. లక్ష్మీపార్వతి పాత్రలో కనిపిస్తోంది. సినిమాకు హైలెట్. నిష్కల్మశమైన ప్రేమ, అమాయకత్వం, బాధ, వేదన, అవమానభారం ఇలా అన్ని భావాలను తెరపై బాగా పలికించింది. లక్ష్మీపార్వతిలో ఇన్ని షేడ్స్ ఉన్నాయా అని ప్రేక్షకులు అనుకోవటం విశేషం. బాబురావు పాత్రలో శ్రీతేజ్ జీవించాడనే చెప్పాలి. కుళ్లు, కుతంత్రం, వెన్నుపోటు రాజకీయాలు చేసే కుటిల రాజకీయ నాయకుడిగా శ్రీ తేజ్ నటన ఆకట్టుకుంటుంది. సినిమా మొత్తాన్ని ఈ ముగ్గురే భుజాలపై వేసుకుని నడిపించారు. ఇతర పాత్రలో అంతా కొత్తవారు. వారి వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
విశ్లేషణ ;
నిజాలను ప్రేక్షకుల ముందు ఉంచే ప్రయత్నం చేశాడు వర్మ. ఎన్టీఆర్ ఎలా ఒంటరి వాడు అయ్యాడు? లక్ష్మీపార్వతికి ఎలా దగ్గరయ్యాడు.. వారిద్దరి మధ్య ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారి తీసింది.? లక్ష్మీపార్వతిపై ఎన్టీఆర్ కుటుంబం ఎలాంటి కుట్రలు చేసింది.. ఆ కుట్రల వెనుక ఉన్న అసలు మనుషులు ఎవరు.. వెన్నుపోటు వెనక ఉన్న అసలు వ్యక్తి ఎవరు.. అన్న విషయాలను ఈ సినిమాలో చూపించారు. కథకు తగ్గట్టు వర్మ మార్క్ టేకింగ్ హైలెట్ గా చెప్పొచ్చు.
లక్ష్మీ పార్వతి- ఎన్టీఆర్ ల మధ్య వచ్చే ప్రతీ సన్నివేశాన్ని చాలా ఎంగేజింగ్ గా, ప్రతీ ఒక్కరూ కన్విన్స్ అయ్యేలా చిత్రీకరించాడు వర్మ. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ కు పరిచయం అవడం, వారి పరిచయం ఇంకాస్త బలపడటంతో ఫస్టాఫ్ కాస్త త్వరగానే అయిపోయిందనిపిస్తుంది. సెకండాఫ్ వచ్చే సరికి కథ స్లోగా సాగుతుంది. ఓసన్నివేశంలో ఎన్టీఆర్ , లక్ష్మీ పార్వతితో చేసే డ్యాన్స్ కు థియేటర్ లో విజిల్స్ పడతాయి. సినిమా అంతా చంద్రబాబుని టార్గెట్ చేసినట్లే అనిపిస్తుంది. ఎన్టీఆర్ ను గద్దె దించెడం, ఆయన అనారోగ్యం లాంటి సీన్లు ఎన్టీఆర్ అభిమానులకు అయ్యోపాపం అనిపిస్తాయి.
ఎన్టీఆర్, లక్ష్మీ ల మధ్య సన్నివేశాలను వర్మ తెరకెక్కించిన విధానం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ఏదేమైనా ఈ మధ్య కాలంలో వర్మ తీసిన సినిమాల్లో ఇది మంచి సినిమా అనే చెప్పుకోవాలి. పాత్రల ఎంపికతోనే సగం విజయం సాదించిన వర్మ.. వారి నుంచి అద్భుతమైన నటనను రాబట్టుకోవటంలోనూ సక్సెస్ అయ్యాడు. ప్రతీ నటుడు తన పాత్రలో లీనమై సహజంగా నటించాడు. సినిమాకు మరో ప్లస్ పాయింట్ కల్యాణ్ మాలిక్ సంగీతం. సన్నివేశాల స్థాయికి పెంచాడు మాలిక్. ఎమోషనల్ సన్నివేశాల్లో సంగీతం ప్రేక్షకులను కన్విన్స్ చేసే విధంగా ఉండటం విశేషం. పాటలు సందర్భానుసారంగా వచ్చేవే. ఇక రీరికార్డింగ్ గురించి చెప్పుకుంటే తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సన్నివేశాలను తర్వాతి స్థాయికి తీసుకెళ్లాడు సంగీత దర్శకుడు. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టున్నాయి.
ప్లస్ పాయింట్స్ ;
కథ, కథనాలు
ఎమోషనల్ సీన్స్
సంగీతం
మైనస్ పాయింట్ ;
సెకండాఫ్ స్లోగా ఉంటుంది
Read Also : గుండెలు అదిరాయి : డ్రంక్ అండ్ డ్రైవ్కు మరణ శిక్ష