One Person Arrested in Tollywood Piracy Case
Tollywood : టాలీవుడ్ పరిశ్రమకు ఉన్న పెద్ద కష్టాల్లో పైరసీ ఒకటి. పైరసీ వల్ల అనేక సినిమాలు నష్టపోయాయి. సినిమా రిలీజయిన మొదటి రోజే ఫుల్ సినిమా నెట్ లో వచ్చేస్తుంది. కొంతమంది ఇక్కడ థియేటర్స్ లోనే షూట్ చేసి పైరసీ సంస్థలకు డబ్బులకు అమ్మేస్తున్నారు. సినీ పెద్దలు పైరసీపై పోరాటం చేస్తున్నారు. ఇటీవల పైరసీ మరింత పుంజుకుంది. మొన్న సంక్రాంతికి వచ్చిన గేమ్ ఛేంజర్ నుంచి ఇటీవల వచ్చిన కన్నప్ప వరకు చాలా సినిమాలు పైరసీ బారిన పడ్డాయి.
తాజాగా పోలీసులు పైరసీ విషయంలో ఓ కీలక వ్యక్తిని అరెస్ట్ చేసారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సినిమా పైరసీ రాకెట్ గుట్టు రట్టు చేసారు. ఇటీవల పైరసీ వల్ల సినీ పరిశ్రమకు 3700 కోట్ల నష్టం వచ్చిందని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసింది.
ఈ కేసులో సినిమాలను పైరసీ చేస్తున్న తూర్పు గోదావరికి చెందిన జన కిరణ్ కుమార్ ను అరెస్ట్ చేసారు. సినిమా విడుదల అయిన రోజే HD వర్షన్ ను పైరసీ చేసి ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్. 2024 సంవత్సరంలో సినిమా పరిశ్రమకు పైరసీ వల్ల 3700 కోట్ల రూపాయల నష్టం జరిగిందని పిర్యాదులో తెలిపారు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్.
అరెస్ట్ అయిన జన కిరణ్ పై 1957 కాపీ రైట్ యాక్ట్, ఐటీ యాక్ట్ లతో పాటు పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. ఇతను మొత్తం ఇప్పటివరకు దాదాపు 65 సినిమాలని పైరసీ చేసాడని, పైరసీ చేసి వెబ్ సైట్స్ కి చిన్న సినిమాలను 32 వేలకు, పెద్ద సినిమాలను 80 వేలకు అమ్ముతున్నాడనో సమాచారం.
Also Read : Ram Pothineni : రాజమండ్రిలో ‘రామ్’ షూటింగ్.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు..