చరణ్ పెద్దమనసు : నూర్ మ‌హ‌మ్మ‌ద్ కుటుంబానికి విరాళం

గ్రేటర్‌ హైదరాబాద్‌ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్‌ మ‌హ‌మ్మ‌ద్ కుటుంబానికి రూ. 10 లక్షలు విరాళం ప్రకటించిన మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్..

  • Publish Date - December 9, 2019 / 11:20 AM IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్‌ మ‌హ‌మ్మ‌ద్ కుటుంబానికి రూ. 10 లక్షలు విరాళం ప్రకటించిన మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్..

గ్రేటర్‌ హైదరాబాద్‌ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్‌ మ‌హ‌మ్మ‌ద్ ఆకస్మిక మరణ వార్తకు మెగా కుటుంబం వెంటనే స్పందించింది. నూర్ మరణించారనే సంగతి తెలియగానే మెగాస్టార్‌ చిరంజీవి నూర్‌ మ‌హ‌మ్మ‌ద్ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ అందుబాటులో లేకపోవడంతో సోమవారం సాయంత్రం రామ్‌చరణ్‌ ఒక ప్రకటన చేస్తూ తాను హైదరాబాద్‌ రాగానే నూర్‌ మ‌హ‌మ్మ‌ద్ కుటుంబాన్నికలుస్తానని తెలిపారు. అలాగే నూర్‌ మ‌హ‌మ్మ‌ద్ కుటుంబానికి రూ. 10 లక్షలు విరాళం ప్రకటించారు.

‘‘నూర్‌ మ‌హ‌మ్మ‌ద్‌గారు మెగా అభిమానులందరిలోకెల్లా గొప్ప వ్యక్తి. ఆయన మా పేరు మీద ఎన్నో పర్యాయాలు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. మా పుట్టినరోజును పురస్కరించుకుని ప్రజలకు ఉపయోగపడే పనులు ఎన్నో చేశారు. ఆయన లేని లోటు తీరనిది. గతంలో ఒకసారి ఆయన హాస్పిటల్‌లో ఉన్నపుడు నేను స్వయంగా ఆ హాస్పిటల్‌కు వెళ్ళి పరామర్శించి వచ్చాను. అక్కడి డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం చేయించాను. నిన్న ఆయన మరణవార్త విన్న వెంటనే షాకయ్యాను.

ఈ సందర్భంగా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అన్నారు. మెగా బ్లడ్‌ బ్రదర్‌ నూర్‌ మ‌హ‌మ్మ‌ద్ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానని రామ్‌చ‌ర‌ణ్ త‌న సంతాపాన్ని ప్రకటించారు. అభిమాని కుటుంబానికి విరాళం ప్రకటించిన చెర్రీని సోషల్ మీడియా ద్వారా పలువురు మెగా ఫ్యాన్స్ అభినందిస్తున్నారు.