Tollywood : టాలీవుడ్ ట్రెండ్ మారిందా..? మళ్ళీ ఫ్యామిలీ డ్రామాలు మొదలయ్యాయా?
ఆడియన్స్ యాక్షన్, వయలెన్స్ సినిమాలకు మొహం మొత్తి.. ఫ్యామిలీ డ్రామాల వైపు చూస్తున్నారు అనే వినిపిస్తుంది. (Tollywood)
- Saketh U
- Published on- August 30, 2026 / 10:09 AM IST
Tollywood
Tollywood : ప్రతీ పదేళ్లకు ఒకసారి జనాల తాలుకూ ఆలోచన శైలి మారుతుంది. ట్రెండ్ అంటారు సినిమావాళ్లు దాన్ని అనే డైలాగ్ బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్లో అలాంటి ట్రెండే మొదలైందా అంటే అవుననే అనిపిస్తోంది సీన్. ఆడియన్స్ యాక్షన్, వయలెన్స్ సినిమాలకు మొహం మొత్తి.. ఫ్యామిలీ డ్రామాల వైపు చూస్తున్నారు అనే వినిపిస్తుంది.
క్యూ లైన్లు.. హౌస్ఫుల్ బోర్డులు.. టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్లో రికార్డులు.. ఎన్ని రోజులు అయింది ఇలాంటి సీన్లు చూసి. ఇప్పుడు ఇరుముడితో మళ్లీ కనిపించింది అలాంటి సీన్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇరుముడి జాతర నడుస్తోంది. భారమైన గుండెలు.. నీళ్లు నిండిన కళ్లతో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తున్న క్షణం. ఇది కదా సినిమా ఇంపాక్ట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పేలుతున్నాయ్. ఆడియెన్స్ థియేటర్కు రావడం లేదు అని విమర్శించే నోళ్లు కూడా ఇరుముడి దెబ్బకు సైలెంట్ అయ్యాయ్. కథ మాములుగా ఉన్నా పర్లేదు కావాల్సిన ఎమోషన్ ఉంటే చాలు.. కాసుల వర్షం కురిపించేందుకు తాము రెడీ అని ఆడియెన్స్ క్లియర్ మెసేజ్ ఇచ్చారు. ఇరుముడి సక్సెస్తో ఇప్పుడు టాలీవుడ్లో కొత్త చర్చ మొదలైంది. ఫ్యామిలీ డ్రామా ట్రెండ్ మొదలైందా.. ప్రేక్షకులు అదే కోరుకుంటున్నారా.. అనే డిస్కషన్ నడుస్తోంది.
Also See : Nidhhi Agerwal : సాంప్రదాయంగా చీరకట్టులో వచ్చి.. ఆవులకు ఆహరం అందించిన నిధి అగర్వాల్..
మన శంకర వరప్రసాద్.. మా ఇంటి బంగారం.. ఇప్పుడు ఇరుముడి.. ఇవే ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్లు. సంక్రాంతికి వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు… బాక్సాఫీస్ను రఫ్ఫాడించారు. ఆ తర్వాత సమ్మర్ సప్పగా సాగుతుంది అనుకుంటున్న టైమ్లో.. మా ఇంటి బంగారం అంటూ వచ్చి సమంత మంచి హిట్ కొట్టింది. అది వంద కోట్ల క్లబ్లో చేరింది. లేడీ ఓరియెంటెడ్ మూవీ.. వంద కోట్లు కొట్టడం ఇదే ఫస్ట్ టైమ్. ఇప్పుడు ఇరుముడి. సినిమా విడుదలైన రెండో రోజే లాభాల బాట పట్టించి.. అరుదైన రికార్డ్ సొంతం చేసుకొన్న సినిమా ఇది.
ఈ మూడు సినిమాలను కంపేర్ చేస్తే కనిపించే కామన్ పాయింట్ ఒక్కటే. ఇవన్నీ ఫ్యామిలీ డ్రామాలే. శంకర వరప్రసాద్ గారుకి చిరు ప్లస్ అయినా.. కావాల్సినన్ని ఎమోషన్స్ ఉన్నాయ్ అందులో. మా ఇంటి బంగారం కూడా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. సమంత యాక్షన్కు ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు, అంతకుమించి ఫ్యామిలీ ఎమోషన్స్ పండాయ్. ఇక ఈ మధ్య వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా కుటుంబాన్ని థియేటర్లకు లాక్కొచ్చింది. ప్రేమకు వయసుతో సంబంధం లేదనే కాన్సెప్ట్ చూపిస్తూనే ఫ్యామిలీ సెంటిమెంట్ను పక్కాగా చూపించాడు డైరెక్టర్. ఇది ఫ్యామిలీను అట్రాక్ట్ చేసింది. సూపర్ హిట్ ఖాతాలో వేసి 150 కోట్లు కలెక్ట్ చేసింది.
Also See :Jabardasth Rohini : జబర్దస్త్ రోహిణి రాఖీ సెలబ్రేషన్స్.. సోదరులతో ఫొటోలు..
ఈ మధ్యలో హిట్ అయిన లెనిన్, చెన్నై లవ్ స్టోరీ సినిమాలకు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పుడు ఇరుముడి కూడా అంతే. తండ్రీ కూతుర్ల అనుబంధమే.. ఈ సినిమాకు బలం. అదే కథని, పాత్రల్ని ముందుకు నడిపించింది. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే సంబంధం లేకుండా కథలో కుటుంబ భావోద్వేగాలు, వినోదం, ఆసక్తికరమైన కథనం ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి వెనుకాడటం లేదని ఈ సినిమాల స్పందన చెప్తోంది. ఓవరాల్గా ఫ్యామిలీ డ్రామాలకు మళ్లీ పాత రోజులు వచ్చాయి అనిపిస్తోంది.
పాన్ ఇండియా, వరల్డ్ బిల్డింగుల గోలలో పడి మన కథల్ని మనం మర్చిపోతున్నాం. అలాంటి టైమ్లో మళ్లీ మన కథలు, మూలాల్ని గుర్తు చేసిన సినిమాలకు ప్రేక్షకులు పట్టం కట్టడం నిజంగా మంచి పరిణామం అనే చర్చ జరుగుతోంది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ స్టోరీస్తో పెద్ద హీరోలు వస్తే వాటికి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందనేది ఈ సినిమా విజయాలు ఇస్తున్న మెసేజ్. దీంతో మళ్లీ ఫ్యామిలీ సినిమాల ట్రెండ్ స్టార్ట్ కావడం ఖాయం. స్టార్ హీరోలంతా ఫ్యామిలీ డ్రామాల వైపు మొగ్గు చూపిస్తారు అనడంలో ఎలాంటి అనుమానం లేదు.
త్వరలో త్రివిక్రమ్ డైరెక్షన్లో ఆదర్శ కుటుంబం వస్తోంది. ఇక చిరు.. కాక మూవీలోనూ ఫ్యామిలీ ఎమోషన్స్ గట్టిగానే దట్టించినట్టు అర్థం అవుతోంది. అది కూడా ఫ్యామిలీ డ్రామానే. తండ్రీ కూతుర్ల అనుబంధం నేపథ్యంలో సాగే కథ. ఈ మూవీస్కు కూడా ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. ఓవరాల్గా థియేటర్కు ఫ్యామిలీ ఆడియన్స్ రాక మళ్లీ పెరగడం తెలుగు సినిమా పరిశ్రమకు ఊరటనిచ్చే పరిణామం. మంచి కథలు, కుటుంబ ప్రేక్షకులకు నచ్చే వినోదం అందిస్తే థియేటర్లు మళ్లీ మెరుస్తాయని వరుస సినిమా విజయాలు చెప్తున్నాయ్.
