MAA Elections: ‘మా’ ఎన్నికల్లో మరో ట్విస్ట్.. రెబల్ స్టార్‌కు లేఖలు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ప్రస్తుత కార్యనిర్వాహక కమిటీకి కాలం చెల్లిందని, కాబట్టి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ సంఘంలోని ఎగ్జిక్యూటివ్ కమిటీలోని 15 మంది సభ్యులు క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖలు రాశారు.

  • Updated on- July 28, 2021 / 02:45 PM IST

Krishnam Raju

Twist in MAA Elections Association Members Letters to Rebel Star Krishnam Raju: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ప్రస్తుత కార్యనిర్వాహక కమిటీకి కాలం చెల్లిందని, కాబట్టి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ సంఘంలోని ఎగ్జిక్యూటివ్ కమిటీలోని 15 మంది సభ్యులు క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖలు రాశారు. గతంలో రాసిన లేఖకు ఇప్పటివరకు సమాధానం లేకపోవడంతో మరోసారి లేఖ రాశారు. ఈ క్రమంలోనే మా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం రేపు(29 జులై) వర్చువల్ పద్దతిలో జరగనుంది. కృష్ణంరాజుకు అందిన లేఖపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.

అసోసియేషన్ శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని ఏకగ్రీవంగా కమిటిని ఏర్పాటు చేసేందుకు సీనియర్ నటుడు మురళీ మోహన్ చేస్తున్న ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో తెలియట్లేదు. ఇప్పటివరకు అయితే రాబోయే ఎన్నికల్లో పోటీ తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రతిసారీ ఇద్దరు మాత్రమే పోటీ పడే ఎన్నికలలో ఈసారి ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతుండగా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే విమర్శనాస్త్రాలు పరోక్షంగా నటులు ఒకరిపై ఒకరు సంధించుకున్న పరిస్థితి.

ప్రస్తుతం ఉన్న వివరాల ప్రకారం.. ‘మా’ అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు, జీవితారాజశేఖర్‌, హేమతో పాటు సీవీఎల్‌ నర్సింహరావు ఉన్నారు. అయితే వీరిలో ప్రకాష్‌ రాజ్‌, మంచు విష్ణు మధ్య ప్రధానంగా పోటీ ఉండనున్నట్లు చిత్రసీమలో చర్చ జరుగుతోంది. జీవిత, హేమ, నర్సింహరావు పోటీ నుంచి తప్పుకునే అవకాశాలూ ఉన్నాయి.