Devara
పాన్ ఇండియా లెవల్లో ఈ నెల 27న విడుదల కానున్న ఎన్టీఆర్ దేవరపై అభిమానుల్లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మ్యాన్ ఆఫ్ మాసెస్ నటించిన ఈ పీరియాడిక్ డ్రామాపై ఎన్నో గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఐతే ఈ సినిమా విడుదల సందర్భంగా చోటుచేసుకున్న ఓ పరిణామం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. ముఖ్యంగా ఏపీలో పొలిటికల్ ఇంట్రెస్టింగ్గా మారిన ఆ ఎపిసోడ్ ఏంటో ఇప్పుడు చూద్దాం….
పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రం దేవర… రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ చొరవతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు మారే అవకాశాలు ఉన్నాయా? అన్న చర్చ జరుగుతోంది. దేవర సినిమా విడుదలపై కొద్ది రోజులుగా ఎంతో సస్పెన్స్ ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత భారీ బడ్జెట్ సినిమాలకు అదనపు షోలు, టికెట్ల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఇదే సమయంలో దేవర రిలీజ్కు సిద్ధమవడంతో ఆ అదనపు సౌకర్యాలు ఉంటాయా? అనే చర్చ జరిగింది. ప్రధానంగా ఎన్టీఆర్కు ఇటు సొంత కుటుంబంతోపాటు నారా వారి కుటుంబంతోనూ గ్యాప్ బాగా పెరగడం… ఆ ఎఫెక్ట్ సినిమాపై పడుతుందా? అనే టెన్షన్ కనిపించింది. కానీ, కూటమి ప్రభుత్వం జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు కొత్త చర్చలు మొదలయ్యాయి.
తన సినిమాకు అదనపు షోలు, టికెట్ల ధర పెంచేందుకు వీలుగా ప్రత్యేక జీవోలు విడుదల కావడంతో ఎన్టీఆర్ ఖుషీ అయ్యారు. తన ఆనందాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎక్స్లో ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు కృతజ్ఞతలు చెబుతూ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. మరోవైపు జూనియర్ ట్వీట్తో రెండు కుటుంబాల మధ్య సంబంధాలు మళ్లీ మెరుగుపడే అవకాశాలు ఉన్నాయా? అనే చర్చ జరుగుతోంది.
టాలీవుడ్లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. నందమూరి అభిమానులతోపాటు ఆయనకు వ్యక్తిగతంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఐతే నందమూరి అభిమానులు ఎప్పుడూ టీడీపీకి వెన్నుదన్నుగా నిలుస్తుంటారు. గత ఐదేళ్లుగా జూనియర్ టీడీపీకి దూరంగా ఉండటమే కాకుండా, చంద్రబాబు కుటుంబంపై తనకు సన్నిహితులైన వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ దూషణలకు దిగినా పట్టించుకోలేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు.
సొంత కుటుంబ సభ్యులను అవమానించినా జూనియర్లో చలనం లేదని టీడీపీ శ్రేణుల్లోనూ ఆగ్రహం ఉంది. కానీ, చంద్రబాబు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ సినిమా విడుదల సందర్భంగా హుందాగా వ్యవహరించారు. మిగతా హీరోలకు ఇచ్చినట్లే జూనియర్ ఎన్టీఆర్కు అదనపు అనుమతులు ఇచ్చారు. దీంతో జూనియర్ వైఖరిలో మార్పు వచ్చే అవకాశం ఉందా? అనే చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ ట్వీట్తో మొదలైన రాజీ…. మున్ముందు మరింత బలపడాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో భవిష్యత్లో ఏం జరగనుందో చూడాల్సివుంది.