Asaduddin Owaisi: అసదుద్దీన్ జెడ్ కేటగిరీ భద్రతకు ఒప్పుకోవాలి – అమిత్ షా

ఒవైసీ కారుపై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన తీరుపై దాని పట్ల జరిపిన దర్యాప్తుపై సోమవారం రాజ్యసభలో వివరణాత్మక సమాధానం ఇచ్చారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.

Owaisi

Asaduddin Owaisi: ఉత్తరప్రదేశ్ లో గురువారం ఎన్నికల ప్రచారం ముగించుకుని వస్తున్న హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన తీరుపై దాని పట్ల జరిపిన దర్యాప్తుపై సోమవారం రాజ్యసభలో వివరణాత్మక సమాధానం ఇచ్చారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.

ఒవైసీ కాన్వాయ్ పైకి కాల్పుల ఘటనలో యూపీ గవర్నమెంట్ నుంచి రిపోర్ట్ తీసుకున్నామని, ఒవైసీ తన పర్యటన సమాచారాన్ని హపూర్ జిల్లా పోలీస్ అధికారులకు అందించలేదని రాజ్యసభకు తెలియజేశారు అమిత్ షా.

‘మీరట్ నుంచి ప్రచారంలో పాల్గొని ఢిల్లీ వస్తుండగా చిజారసీ టోల్ ప్లాజా వద్ద కాల్పులు జరిగాయి. ఒవైసీ కాన్వాయ్ లోని కారుకు మూడు బుల్లెట్లు తగిలినప్పటికీ సురక్షితంగా బయటపడ్డారు. సాక్షుల ధ్రువీకరణతో ఇద్దరిపై IPC సెక్షన్ 307 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. తదుపరి విచారణ కొనసాగుతోంద’ని కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు.

Read Also: కూరగాయలమ్మే చిన్నారి ఇకపై స్కూల్‌కే

కేంద్ర భద్రతా సంస్థల నుంచి వచ్చిన సమాచారం మేరకు అసదుద్దీన్ కు భద్రత కల్పించాలని కేంద్ర నుంచి ఆదేశాలు వచ్చాయి. సెక్యూరిటీ విషయంలో ఒవైసీ నిరాకరించడంతో ఢిల్లీ పోలీసులు, తెలంగాణ పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమవుతున్నాయని అన్నారు.

‘అసదుద్దీన్ ప్రాణాలకు ముప్పుందనే భద్రతా సంస్థల అంచనాలు తాజా ఘటనతో మరోసారి నిరూపితం అయ్యాయి. ఒవైసీకి బుల్లెట్ ప్రూఫ్ వాహనంతోపాటు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్రం అనుకుంటుంది. సెక్యూరిటీకి ఒవైసీ నిరాకరించారు. సభ తరఫున మరోసారి అభ్యర్థిస్తున్నా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జెడ్ ప్లస్ సెక్యూరిటీని అంగీకరించండి’అని అమిత్ షా సూచించారు.