జులై-3 నుంచి వందే భారత్​ మిషన్ 4వ దశ….17దేశాలకు 170 విమానాలు

  • Published By: venkaiahnaidu ,Published On : June 28, 2020 / 05:32 PM IST
జులై-3 నుంచి వందే భారత్​ మిషన్ 4వ దశ….17దేశాలకు 170 విమానాలు

Updated On : June 28, 2020 / 5:33 PM IST

కరోనా సంక్షోభ సమయంలో విదేశాల్లో చిక్కుకున్న వారిని తమ స్వస్థలాలకు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వందే భారత్​ మిషన్​ నాలుగో దశ త్వరలో ప్రారంభం కానుంది. కరోనా కారణంగా మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సేవలను రద్దు చేసిన ప్రభుత్వం… లాక్​డౌన్​తో చిక్కుకుపోయిన వారిని తమ స్వస్థలాలకు తరలించేందుకు మే 6 న వందే భారత్​ మిషన్​ను ప్రారంభించింది.

జూన్​ 10న ప్రారంభమైన 3వ దశలో వివిధ దేశాలకు 495 ప్రత్యేక విమానాలను నడుపుతోంది ఎయిరిండియా. ఈ మిషన్​ వచ్చే నెల 4న ముగియనుంది. ఈ సమయంలో వందే భారత్​ మిషన్​ నాలుగో దశను జులై-3 నుంచి 15 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది కేంద్రం. ఇందులో భాగంగా 170 ఎయిరిండియా ప్రత్యేక విమానాలను 17 దేశాలకు(నాలుగో దశ మిషన్​లో భాగంగా కెనడా, అమెరికా, బ్రిటన్, కెన్యా, శ్రీలంక, ఫిలిప్పీన్స్​, కిర్గిస్థాన్​, సౌదీ అరేబియా, బంగ్లాదేశ్​, థాయ్​లాండ్​, దక్షిణాఫ్రికా, రష్యా, ఆస్ట్రేలియా, మయన్మార్, జపాన్​, ఉక్రెయిన్​, వియత్నాం) పంపనున్నట్లు ప్రకటించింది.

ఇండో- యూకే మార్గం ద్వారా 38 విమానాలు, ఇండో- యూఎస్​ మార్గంలో 32 విమానాలను నడపనున్నారు. సౌదీ అరేబియాకు 26 విమానాలు తమ సేవలను అందించనున్నాయి.

మరోవైపు,షెడ్యూల్డ్  ఇంటర్నేషనల్  కమర్షియల్ ఫ్లైట్  సర్వీసులపై బ్యాన్ ను జూలై 15 వరకు పొడిగించింది భారత్. కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి 25 న దేశీయ మరియు అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే మే 25 న పరిమిత స్థాయిలో  దేశీయ విమాన  కార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ,  అంతర్జాతీయ విమానాలను ఇప్పటికీ అనుమతించలేదు.