Vande Bharat Express: వందే భారత్ రైలుపై మరోసారి రాళ్ల దాడి.. ఈ సారి ఎక్కడంటే?
వందే భారత్ రైలుపై మరోసారి రాళ్ల దాడి ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దల్కోలా స్టేషన్ గుండా వెళ్తున్న హౌరా-న్యూ జల్పైగురి ఎక్స్ప్రెస్ రైలుపై అకస్మాత్తుగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.
- Harishth Thanniru
- Published On : January 21, 2023 / 10:35 AM IST
Vande Bharat Express
Vande Bharat Express: వందే భారత్ రైలుపై మరోసారి రాళ్ల దాడి చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దల్కోలా స్టేషన్ గుండా వెళ్తున్న హౌరా-న్యూ జల్పైగురి ఎక్స్ప్రెస్ రైలుపై అకస్మాత్తుగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ రాళ్ల దాడిలో సీ-6 కోచ్పై రాళ్లు విసరడంతో కిటికీలకు పగుళ్లు వచ్చాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రాళ్ల దాడి జరగడం ఇదే మొదటిసారికాదు.. జనవరి 2న మాల్దాలో తొలిసారి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాటి చేశారు. ఆ తరువాత జనవరి 3నసైతం డార్జిలింగ్ నుంచి వెళ్తున్న వందేభారత్ రైలుపై రాళ్లదాడి చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
తాజాగా వందేభారత్ రైలుపై జరిగిన దాడి గురంచి ప్రయాణికులు మాట్లాడుతూ.. దల్కోలా సమీపంలో పెద్ద శబ్దం వినిపించిందని తెలిపారు. అనంతరం రైలులో ఉన్న ఆర్పీఎఫ్ అధికారులకు సమాచారం ఇవ్వగా.. అధికారులు చర్యలు ప్రారంభించారు. సాయంత్రం 4గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. అద్దాలు పగుళ్లు వచ్చాయని ఓ ప్రయాణికుడు తెలిపారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఈ తరహా ఘటన ఎదురైంది. విశాఖ పట్టణంలో వందే భారత్ ట్రైన్ బోగీలపై కంచరపాలెంలో గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లదాటికి పాల్పడ్డారు.
Vande Bharat Express : వారెవ్వా వందే భారత్.. అదిరిపోయే ఫీచర్లు, రైలులో విమాన ప్రయాణం అనుభూతి
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో డిసెంబర్ 30న మొదటి వందే భారత్ రైలును ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో తొలి వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. హౌరా నుండి జల్పైగురిని కలుపుతూ ఈ రైలును ప్రారంభించారు.
