Bhopal bjp mp photo poses front vehicles carrying : కరోనా ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబం..వారి బంధువులు ఎంతగా బాధపడతారో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. కానీ కరోనా చనిపోయిన వారి మృతదేహాలను తరలించే వాహంన ముందు నిలబడి ఓ ఎంపీ చక్కగా ఫోటోలకు ఫోజులిచ్చారు. మహమ్మారికి బలైపోయినవారి కుటుంబ సభ్యుల కన్నీటితో విలపిస్తుంటే బీజేపీ ఎంపీగారు మాత్రం చక్కగా ఆ మతులను తరలించే వాహనం ముందు నిలబడి ఫోటో షూట్ కార్యక్రమం పెట్టుకోవటం పెను విమర్శలకు దారి తీసింది.
దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. కంటికి కనబడని ఈ మహమ్మారి బారిన పడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి పెను విషాదకర..దయనీయ పరిస్థితుల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక బీజేపీ ఎంపీ చేసిన పని వివాదాస్పదంగా మారింది.
భోపాల్ ఎంపీ, మాజీ మేయర్ అలోక్ శర్మ కోవిడ్తో చనిపోయిన వారిని శ్మశానానికి తరలించే ‘ముక్తి వాహనం’ ముందు నిలబడి ఫోటోలకు పోజిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పైగా తన ఫొటోషూట్ కోసమే ఈ వాహనాలను చాలా సేపు ఆపారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకుడు నరేంద్ర సలుజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి నీచనమైన చర్యకు పాల్పడినందుకు సిగ్గుపడాలని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాగా దీన్ని చూసిన నెటిజన్లు సైతం బీజేపీ ఎంపీ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఆత్మీయుల్ని కోల్పోయి బాధపడేవారి గురించి కనీసం ఆలోచించకుండా విషాదకర పరిస్థితుల్లో కూడా ఇలాంటి ఫోటో ఫోజులు ఏంటి అంటూ ఏకిపడేస్తున్నారు.