Ketan Agarwal Murder Case: లోయలోకి తోసింది కాబోయే భార్యే.. ప్రియుడితో కలిసి మర్డర్ ప్లాన్.. కేతన్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు
మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన పుణె ట్రెక్కర్ కేతన్ అగర్వాల్(Ketan Agarwal Murder Case) మృతి కేసు చిక్కుముడి వీడింది.
pune trekker ketan agarwal murder case fiance siya goyal arrested for pushing him into valley with lovers help
Ketan Agarwal Murder Case: మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన పుణె ట్రెక్కర్ కేతన్ అగర్వాల్ మృతి కేసు చిక్కుముడి వీడింది. ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా భావించిన ఈ ఘటన.. ప్రియుడితో కలిసి కాబోయే భర్తను అంతమొందించిన ఘోర హత్యగా తేలింది. రూ. 17 కోట్ల భారీ బడ్జెట్ పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో ఈ దారుణం వెలుగుచూడటం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
బర్త్డే ట్రిప్లో మర్డర్ స్కెచ్:
పుణెకు చెందిన 26 ఏళ్ల కేతన్ అగర్వాల్(Ketan Agarwal Murder Case) కుటుంబ రియల్ ఎస్టేట్ సంస్థలో డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. అతనికి సియా గోయల్ అనే యువతితో నిశ్చితార్థం జరిగింది. జూన్ 18న సియా పుట్టినరోజు కావడంతో, వీరిద్దరూ కలిసి లోహగడ్ కోటకు ట్రెక్కింగ్కు వెళ్లారు. అయితే, సియాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఆమె తన సహోద్యోగి, ప్రియుడైన చేతన్ చౌదరితో ప్రేమలో ఉంది. కేతన్ను వదిలించుకోవాలనే ప్లాన్తో, తన ప్రియుడిని కూడా రహస్యంగా ఆ ట్రిప్కు రప్పించింది. లోహగడ్ కోట వద్ద ఫొటోలు దిగుతున్న సమయంలో, కేతన్ను ఒక్కసారిగా లోతైన లోయలోకి తోసేసింది.
కట్టుకథను ఛేదించిన పోలీసులు:
హత్య అనంతరం కేతన్ ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయాడంటూ సియా పోలీసులకు కట్టుకథ చెప్పింది. అయితే, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సియా ఫోన్ కాల్ డేటా, సెల్ టవర్ లొకేషన్లను పరిశీలించగా అసలు నిజాలు బయటపడ్డాయి. ఘటన సమయంలో ప్రియుడు చేతన్ చౌదరి కూడా అక్కడే ఉన్నట్లు సాంకేతిక ఆధారాల ద్వారా నిరూపితమైంది. పోలీసుల శైలి విచారణలో పొంతన లేని సమాధానాలు చెప్పిన సియా, చివరకు ప్రియుడితో కలిసి చేసిన హత్యను అంగీకరించింది.
రూ. 17 కోట్ల రాయల్ వెడ్డింగ్ రీల్.. విషాదాంతం:
కేతన్, సియా వివాహం ఈ ఏడాది నవంబర్లో రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఒక విలాసవంతమైన ప్యాలెస్లో జరగాల్సి ఉంది. ఈ రాయల్ వెడ్డింగ్ కోసం కుటుంబ సభ్యులు దాదాపు రూ. 17 కోట్లు ఖర్చు చేస్తూ, అతిథుల కోసం రెండు ప్రైవేట్ విమానాలను కూడా బుక్ చేశారు. పెళ్లి సంబరాల్లో మునిగిపోయిన కుటుంబాల్లో ఈ ఘాతుకం కోలుకోలేని విషాదాన్ని నింపింది. ప్రస్తుతం నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరిలను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
