Shiv Sena (UBT) celebrations (Image Credit To Original Source)
BJP: ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. దీంతో దేశ వ్యాప్తంగా సంబరాలు చేసుకోవాలని నిర్ణయించింది. బీజేపీ తెలంగాణ కార్యాలయంలోనూ ఇవాళ సంబరాలు చేసుకుంటున్నారు. రస్మలాయ్ స్వీట్ను పంపిణీ చేయాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు నిర్ణయించారు.
దేశ వ్యాప్తంగా వినూత్న రీతిలో సంబరాలు చేసుకోవాలని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. ఇటీవల ముంబై కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో తమిళనాడు బీజేపీ నేత అన్నామలై పాల్గొన్న విషయం తెలిసిందే.
అన్నామలైను రసమలై అంటూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే ఎద్దేవా చేశారు. ‘హటావో లుంగీ, బజావో పుంగీ’ అని నినాదం చేశారు. దీంతో ఇదే అంశంపై ఎన్నికల్లో పెద్ద ఎత్తున దుమారం రేగింది.
ఇప్పుడు బీఎంసీ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజార్టీ దక్కింది. రాజ్ థాకరే వ్యాఖ్యలను తిప్పికొడుతూ లుంగీలతో సంబరాలు చేసుకోవాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. సంబరాల్లో పాల్గొనే నేతలంతా లుంగీలో కనపడుతున్నారు.
బీజేపీ-శివసేన కూటమి హవా
మహారాష్ట్రలోని 29 మునిసిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రారంభ ట్రెండ్ల ప్రకారం భారతీయ జనతా పార్టీ-శివసేన కూటమికి అనుకూల ఫలితాలు వస్తున్నాయి. మధ్యాహ్నం 2.40 గంటల వరకు వచ్చిన ట్రెండ్ల ప్రకారం బీజేపీ 1,087 వార్డుల్లో ఆధిక్యంలో ఉండగా, దాని మిత్రపక్షమైన శివసేన 291 వార్డుల్లో ముందంజలో ఉంది.
ముఖ్యంగా ముంబైపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. తమ రాజకీయ వారసత్వాన్ని తిరిగి పొందాలనే లక్ష్యంతో థాకరే సోదరులు మళ్లీ కలిసికట్టుగా బరిలోకి దిగారు. వారు బీజేపీ-శివసేన కూటమిని ఓడిస్తామని అన్నారు. అయితే, బీజేపీ నేతృత్వంలోని కూటమి బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్లో 118 వార్డుల్లో ముందంజలో ఉంది. మరోవైపు, థాకరే సోదరుల నేతృత్వంలోని పార్టీలు మొత్తం కలిపి 78 వార్డుల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.