Bjp Leader Challenges To Mamata Banerjee : దమ్ముంటే మీరు అక్కడ పోటీ చేయండి.. మమత బెనర్జీకి బీజేపీ ఎమ్మెల్యే సవాల్
బెంగాల్ లో కాంగ్రెస్ ఉనికిలో లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యాలయానికి తాళం వేసి, ఆ పార్టీ నేతలు టీఎంసీ కార్యాలయంలో కూర్చోవాలని బీజేపీ ఎమ్మెల్యే అగ్ని మిత్ర పాల్ ఎద్దేవా చేశారు.
- Harishth Thanniru
- Published On : December 23, 2023 / 02:38 PM IST
Mamata Banerjee
Mamata Banerjee : వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీగా ఉన్నారు. గత రెండు దఫాలుగా మోదీ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, ఈసారి ప్రధాని నరేంద్ర మోదీపై పోటీగా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని వారణాసి నుంచి బరిలోకి దింపాలని విపక్ష నేతలు కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ టీఎంసీ చీఫ్ మమత బెనర్జీకి ఓ సవాల్ చేశారు. వారణాసి నుంచి ప్రధానిపై మమత ఎందుకు పోటీ చేయకూడదని ప్రశ్నించారు. ఆమెకు ధైర్యం ఉంటే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మోదీపై వారణాసి నుంచి పోటీ చేయాలని సవాల్ చేశారు.
Also Read : Ayodhya Ram Mandir : రాముడు అయోధ్య నుంచి లంకకు నడిచి వెళ్లినదారిలో పాదుకలతో పాదయాత్ర చేస్తున్న భక్తుడు..
మహా కూటమి సీట్ల పంపకాల ఫార్ములా ఎలా ఉంటుందో చూస్తున్నాం.. ఆ పార్టీలు ఎప్పటికీ రాజీపడవు. వారి భావజాలం వేరని అగ్ని మిత్ర పాల్ అన్నారు. దొంగతనం చేసి బంధుప్రీతి పెంచడమే టీఎంసీ సిద్ధాంతం. వీరిలో ఒకటే సాధారణ విషయం.. అది దొంగతనం అంటూ ఎద్దేవా చేశారు. టీఎంసీ హింసలో మరణించిన కాంగ్రెస్ కార్యకర్తలు కూటమిగా ఎన్నికలకు వెళితే ప్రజలకు సమాధానం చెప్పగలరా అంటూ బీజేపీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. టీఎంసీ చీఫ్ మమత ప్రధాని కావాలంటే ప్రధాని నరేంద్ర మోదీపై వారణాసి నుంచి పోటీ చేయాలని అన్నారు.
బెంగాల్ లో కాంగ్రెస్ ఉనికిలో లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యాలయానికి తాళం వేసి, ఆ పార్టీ నేతలు టీఎంసీ కార్యాలయంలో కూర్చోవాలని అగ్ని మిత్ర పాల్ ఎద్దేవా చేశారు. బెంగాల్ ప్రజలు ఇప్పటి వరకు మీ నాటకాన్ని నమ్ముతున్నారు.. కానీ, ఇప్పుడు కాదు.. మీ నిజస్వరూపం ఇప్పుడు ప్రజలకు తెలుసని అన్నారు.
ఇదిలాఉంటే గతంలోనూ బీహార్ సీఎం నితీష్ కుమార్ కు ఇలాంటి సవాల్ బీజేపీ నుంచి ఎదురైంది. వారణాసి నుంచి ప్రధాని మోదీపై పోటీ చేయాలని నితీష్ కుమార్ కు బీజేపీ నేతలు గతంలో సవాల్ చేశారు. నితీష్ కుమార్ వారణాసిలో ర్యాలీ నిర్వహించబోతున్నారని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఇటీవల చెప్పారు. ఆయనకు దమ్ము, ధైర్యం ఉంటే వారణాసి నుంచి ప్రధాని మోదీపై పోటీ చేస్తే ప్రతిపక్షాలు ఆయన్ను కూటమికి ప్రధానిని చేస్తాయని అన్నారు.
