ఢిల్లీ : లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా , మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోటానికి కమలదళం శాయశక్తులా కృషిచేస్తోంది. అందులో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన ఉద్యమం ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారు మోగి పోతోంది. సోషల్ మీడియా వేదికగా మార్చి 17న మోడీ తన ట్విట్టర్ ఖాతాలో పేరును చౌకీదార్ నరేంద్ర మోదీ గా మార్చుకున్నారు. ఆ తర్వాత ఇంక పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా తమ ట్విట్టర్ ఖాతాల పేర్లకు చౌకీదారు అనే పదాన్ని జత పరిచారు.
యధారాజ, తధాప్రజ అన్నట్టు నాయకులు చౌకీదారులైతే కార్యకర్తలు ఊరుకుంటారా, ఇంక వాళ్ళు కూడ తమ సోషల్ మీడియా ఎకౌంట్ లో తమ పేరుకు ముందు కానీ, చివర కానీ, చౌకీదార్ ను తగిలించేసుకుని బీజేపీ కి చెందిన వారుగా గుర్తింపు పొందుతున్నారు. “కాపలాదారే దొంగ” అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మోడీ పై ఎన్నికల ప్రచార సభల్లో చేసిన ఆరోపణలను తనకు అనుకూలంగా మార్చుకుని మోడీ చేసిన వినూత్న ప్రచారం నేడు పెద్దఎత్తున ఊపందుకుంది. చౌకీదార్ పేరుతో బీజేపీ విడుదల చేసిన పాట కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. చౌకీదారు పేరుతో టీ షర్టులు, క్యాప్ లు, బ్యాక్ ప్యాక్ లు అందరినీ అలరిస్తున్నాయి.