Electronic Interlocking – Odisha Train Accident : రైల్వేస్ లో సిగ్నలింగ్ వ్యవస్థ అత్యంత కీలకం. రైళ్ల రాకపోకల్లో అత్యంత ముఖ్యం. ఈ సిస్టమ్ సరిగా లేకపోతే ఎలాంటి ఘోర ప్రమాదాలు జరుగుతాయో ఒడిశా ట్రైన్ యాక్సిడెంట్ రుజువు చేసింది.
రైల్వేలో ఒకప్పుడు మ్యానువల్ ఇంటర్ లాకింగ్ సిగ్నల్స్ ఉండేవి. రైలు ఏ లైన్ లో వెళ్లాలో, మనుషులు సిగ్నల్ లైట్ ని ఆన్ చేసి ట్రాక్ ని నిర్ణయించే వారు. ఆ తర్వాత ఆధునికమైన మెకానికల్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్ వచ్చింది. టెక్నాలజీ మరింత అభివృద్ది చెందాక ఆటోమేటిక్ ఇంటర్ లాకింగ్ సిగ్నలింగ్ సిస్టమ్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు.(Electronic Interlocking)
రెండు రైళ్లు ఒకే ట్రాక్ పైకి వెళ్లకుండా నియంత్రిస్తుంది:
ఇది అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థ. రైళ్లు ఒకే ట్రాక్ పైకి వెళ్లకుండా నియంత్రిస్తుంది. కానీ, ఒడిశా రైలు ప్రమాదం.. పాయింట్ మిషన్, ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్ లో లోపాల కారణంగా జరిగిందని ప్రాథమిక దర్యాఫ్తులో తేలింది. ఇక, ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సమయంలో జరిగిన ఈ మార్పులు ప్రమాదానికి కారణమయ్యాయి. అసలు ఇది ఎలా జరిగింది? ఎవరు చేశారు? అనే అంశం దర్యాఫ్తులో తెలుస్తుందని రైల్వే మంత్రి చెప్పారు.
Also Read..Kavach : కవచ్ ఉన్నా.. ప్రమాదం జరిగేదా? అసలు ఏంటీ కవచ్? రైలు ప్రమాదాలను ఎలా అరికడుతుంది?
లేటెస్ట్ సిగ్నలింగ్ టెక్నాలజీ ఉన్నా.. ప్రమాదం ఎలా జరిగింది?
ఒక ట్రాక్ పై రైలు ఆగి ఉంటే.. ఆ ట్రాక్ పైకి మరో రైలు వెళ్లకుండా ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్ నిరోధిస్తుంది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మన రైల్వేశాఖ ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ట్రాక్ క్లియర్ గా ఉండగానే ఇంటర్ లాకింగ్ గ్రీన్ సిగ్నల్ వస్తుంది. లేదంటే, ఎంత సేపు అయినా ముందుకు కదలకుండా నిరోధిస్తుంది. అటువంటి అత్యాధునిక ఇంటర్ లాకింగ్ సిగ్నలింగ్ వ్యవస్థ ఉన్నప్పుడు.. ఒడిశా బాలాసోర్ లో ఎందుకు ప్రమాదం జరిగింది? అన్నదే ఇప్పుడు దేశ ప్రజల మదిని తొలుస్తున్న ప్రశ్న.
ఈ సిస్టమ్తో.. చాలావరకు తగ్గిన రైలు ప్రమాదాలు:
ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సమయంలో జరిగిన మార్పులు ప్రమాదానికి కారణం అని ప్రాథమిక దర్యాఫ్తులో తేలింది. రైల్వే ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిగ్నలింగ్ సిస్టమ్ లో రైళ్లు ఒకదానికి ఒకటి ఢీకొనే అవకాశాలు ఉండవు. అత్యాధునిక ఈ సిస్టమ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రమాదాలు చాలా వరకు తగ్గాయి. భద్రతా సామర్థ్యం పెరిగింది. కంప్యూటర్ సాయంతో రైళ్ల రాకపోకలను నియంత్రిస్తారు. దీనిలోని సెన్సర్ల ద్వారా ఏ ట్రాక్ పై ఏయే రైలు ఎక్కడ ఆగి ఉందో కంట్రోల్ రూమ్ కి ఫీడ్ బ్యాక్ అందుతుంది. సురక్షిత రాకపోకలకు ట్రాక్ సర్క్యూట్ ని సూచిస్తుంది.
కవచ్ సిస్టమ్ ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదన్న వాదనను రైల్వేశాఖ మంత్రి విబేధించారు. కవచ్ కు ఈ ప్రమాదానికి సంబంధమే లేదన్నారు. కవచ్ సిస్టమ్.. రెండు రైళ్లు ఒకే ట్రాక్ పై ఎదురుదెరుగా వచ్చినప్పుడు ఢీకొట్టకుండా ఉపయోగపడుతుంది. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్.. ఒకే ట్రాక్ పై రైలు వెనుక మరో రైలు వెళ్లకుండా నిరోధిస్తుంది.
ఇంటర్ లాకింగ్ అత్యాధునిక భద్రత వ్యవస్థ:
ఇంటర్ లాకింగ్ అత్యాధునిక భద్రత వ్యవస్థ. రైల్వే జంక్షన్లు, స్టేషన్లు, సిగ్నలింగ్ పాయింట్ల వద్ద రైళ్ల కదలికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు దీన్ని ఉపయోగిస్తున్నారు. దీని ఆధారంగానే రైల్వే స్టేషన్లలో రైలు ఏ ట్రాక్ పై ఆగాలి? ఆగకుండా డైరెక్ట్ గా వెళ్లేందుకు వేరే ట్రాక్ లోకి మార్చుకోవాలి అన్నది నిర్ణయం తీసుకుంటారు.
ఇంటర్ లాకింగ్ వ్యవస్థలో ఉండే ట్రాక్ సర్క్యూట్లు రైళ్ల కదలికలను గుర్తించడంలో సహాయ పడతాయి. అందుకు అనుగుణంగా రైళ్ల కదలికలను నియంత్రించడానికి ఇంటర్ లాకింగ్ సిస్టమ్ అనుమతి ఇస్తుంది. ఇంటర్ లాకింగ్ సిస్టమ్.. సిగ్నల్స్, ట్రాక్ సర్క్యూట్ల స్థితిని పర్యవేక్షిస్తుంది. రెండు రైళ్లు ఒకే ట్రాక్ పై వెళ్లకుండా, జంక్షన్ల దగ్గర వ్యతిరేక దిశలో ప్రయాణించే రైళ్లను పసిగట్టి ప్రమాదాలను నివారించేందుకు సహాయపడుతుంది.
Also Read..Odisha Train Accident: రైలు ప్రమాదంలో ఎక్కువమంది చనిపోవడానికి అసలు కారణం ఇదే..
ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్.. లేటెస్ట్ వెర్షన్..
ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ అనేది.. ఇంటర్ లాకింగ్ టెక్నాలజీ లేటెస్ట్ వెర్షన్. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ ద్వారా రైళ్ల కదలికలను పర్యవేక్షించి ప్రమాదాల నుంచి నియంత్రించేందుకు వీలుంటుంది. సిగ్నల్ పాయింట్లను, ట్రాక్ సర్క్యూట్లను నిర్వహిస్తూ సమన్వయం చేసేందుకు ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సాయపడుతుంది. వీటిని సమన్వయం చేయడానికి కంప్యూటర్లను, ప్రోగ్రామ్డ్ లాజిక్ కంట్రోలర్, కమ్యూనికేషన్ నెట్ వర్క్స్ ని ఉపయోగిస్తారు.