raigarh municipal notice issued to lord hanuman to deposit water tax : వాటర్ టాక్స్ సకాలంలో కట్టకపోతే ..కనెక్షన్ పీకేస్తామని లేదా వాటర్ సరఫరా నిలిపివేస్తామని మున్సిపల్ అధికారులు ప్రజలకు వార్నింగ్ ఇస్తుంటారు. కానీ ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్లో మాత్రం మున్సిపల్ అధికారులు ఏకంగా ఆంజనేయస్వామికే నోటీసులు పంపించారు. 15 రోజుల్లో వాటర్ బిల్ కట్టాలని వార్నింగ్ కూడా ఇచ్చారు.
అసలు విషయం ఏమిటంటే..రాయ్ గఢ్ నగరంలోని వార్డు నంబర్ 18 దరోగపరాలో ఓ హనుమంతుడి ఆలయం ఉంది. ఈ ఆలయానికి నీటి పన్ను బకాయి ఉందని వెంటనే కట్టాలని నోటీసులు జారీ చేశారు మున్సిపాలిటీ అధికారులు. 15 రోజుల్లో ట్యాక్స్ కట్టాలంటూ నోటీసులో పేర్కొన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి ఏంటి అంటే హనుమంతుడికి అదేనండీ హనుమాన్ ఆలయానికి అస్సలు మున్సిపల్ కుళాయి కనెక్షనే లేకపోవటం.
ఆ నోటీసు చూసిన ఆలయ నిర్వాహకులు దేవాలయానికి ఒక్క కుళాయి కనెక్షన్ కూడా లేదని మున్సిపల్ అధికారులకు చెప్పారు. అయినప్పటికీ వాటర్ ట్యాక్స్ కట్టాల్సిందేనంటూ అధికారులు అంటున్నారు. దీంతో ఇదేం గోలరా బాబూ అంటూ తలలు పట్టుకున్నారు ఆలయ నిర్వాహకులు. మున్సిపల్ కార్పొరేషన్ తీరుపై స్థానిక వార్డు ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.