China Boycott G20 Meetings: శ్రీనగర్లో జరిగే జీ20 సమావేశాన్ని చైనా బహిష్కరించింది.. కారణమేమిటంటే?
జమ్మూ కశ్మీర్లో జరిగే జీ-20 సమావేశానికి హాజరు కాబోమని, ఆ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని చైనా తెలిపింది.
- Harishth Thanniru
- Published On : May 20, 2023 / 10:28 AM IST
China President Xi Jinping
China Boycott G20 Meetings: మే 22 నుంచి మే 24వరకు జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్లో మూడవ జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. శ్రీనగర్లో జరగనున్న ఈ జీ-20 సమావేశం జమ్మూ కశ్మీర్కు తన నిజమైన సామర్థ్యాన్ని చాటుకోవడానికి గొప్ప అవకాశం అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. శ్రీనగర్లో జరిగే ఇలాంటి అంతర్జాతీయ కార్యక్రమం దేశానికి, ప్రపంచానికి సానుకూల సందేశాన్ని పంపుతుందని సింగ్ అన్నారు.
జమ్మూ కశ్మీర్లో జరిగే జీ-20 సమావేశానికి హాజరు కాబోమని, ఆ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని చైనా తెలిపింది. ఈ విషయంపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. ఈ సమావేశం వివాదాస్పద ప్రాంతమైన జమ్మూకశ్మీర్లో జరుగుతుండటంతో హాజరుకావొద్దని నిర్ణయించినట్లు చెప్పారు. పాకిస్థాన్కు ప్రస్తుతం చైనా సన్నిహిత మిత్రదేశంగా మెలుగుతుంది. జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంపై గతంలోకూడా పాకిస్థాన్, చైనా తప్పుడు వ్యాఖ్యలు చేశాయి. వారి వ్యాక్యలను భారత్ ఇప్పటికే తోసిపుచ్చింది.
జీ-20 సమావేశాన్ని పాకిస్థాన్ కూడా మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. దీనికి కారణం.. 2019 సంవత్సరంలో జమ్మూకశ్మీర్ నుండి ఆర్టికల్ 370 మరియు 35ఏలను భారతదేశం రద్దు చేసింది. ఆ తరువాత పాకిస్థాన్ పాలకులు జమ్మూ కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వేదికపై అనేక సందర్భాల్లో లేవనెత్తారు. కశ్మీర్ భారత్ అంతర్గత సమస్య అని, దీనిపై ఎవరిమాట వినబోమని భారత్ సూటిగా సమాధానం ఇచ్చిన విషయం విధితమే.
