ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా హైదరాబాదీ మెడిసిన్ సిద్ధమైంది. నగరంలోని సుప్రసిద్ధ జెనరిక్ ఫార్మాస్యూటికల్ కంపెనీ హెటిరో సంస్థ… కరోనాను కట్టడిచేసే రెమ్ డెసీవర్ ఔషధాన్ని ‘కోవిఫర్’ ఇంజెక్షన్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మేరకు కరోనా మహమ్మారిపై పోరాటంలో హెటిరో ఆదివారం కీలక ప్రకటన చేసింది.
కోవిడ్-19పై పోరాటంలో భాగంగా ఇన్వెస్టిగేషన్ యాంటీ వైరల్ మెడిసిన్ (రెమ్డిసివిర్) ఉత్పత్తి, మార్కెటింగ్ కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి పొందినట్లు హెటిరో తెలిపింది. రెమ్ డెసీవర్ హెటిరో జెనరిక్ వెర్షన్కు ‘కోవిఫర్’ అనే పేరుతో భారతదేశంలో మార్కెట్లోకి రానున్నట్లు తెలిపింది. ఈ ఇంజెక్షన్లను లక్షడోసుల మేర సిద్ధం చేశామని సోమవారం నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రకటించింది.
ఈ సందర్భంగా హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ డాక్టర్ బి.పార్థసారథి రెడ్డి మాట్లాడుతూ…దేశంలో కోవిడ్-19 కేసులు పెద్ద ఎత్తున పెరుగుతున్న తరుణంలో `కోవిఫర్` (రెమ్ డెసీవర్) విజయవంతమైన క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకొని అందుబాటులోకి రావడం గేమ్ చేంజర్గా మారనుంది. బలమైన ఇంటిగ్రేషన్ సామర్థ్యాలను కలిగి ఉండటం వల్ల ఈ ఉత్పత్తి దేశవ్యాప్తంగా వెంటనే రోగులకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం నెలకొన్న అవసరాలకు తగిన రీతిలో రోగులకు తగినట్లుగా ఉత్పత్తులు అందించేందుకు సిద్ధమవుతోంది. కోవిడ్-19పై పోరాటంలో భాగంగా ప్రభుత్వం, వైద్య విభాగాలతో మేం నిరంతరం కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం అని ప్రకటించారు.
డీసీజీఐ అనుమతి పొందిన రెమ్ డెసీవర్ ఔషధాన్ని కోవిడ్ అనుమానితులు లేదా ల్యాబ్లలో పరీక్ష చేసిన అనంతరం పాజిటివ్ రోగులుగా గుర్తించబడిన చిన్నారులు, యువత, కోవిడ్ లక్షణాలతో ఆస్పత్రి పాలైన వారి చికిత్స కోసం వినియోగించవచ్చు. కోవిఫర్ 100 మిల్లీగ్రాములు ఇంజెక్షన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. తక్కువ మధ్య స్థాయి ఆదాయం కలిగిన దేశాల్లోని ప్రజలకు కోవిడ్-19 చికిత్స చేయడంలో భాగంగా గిలిడ్ సైన్సెస్ ఐఎన్సీ తో కుదుర్చుకున్న లైసెన్స్ ఒప్పందాన్ని అనుసరించి ఈ ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
కాగా, దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అయితే కోలుకుని డిశ్చార్జ్ అవుతున్న ప్రజల గ్రాఫ్ కూడా వేగంగా పెరుగుతోంది. దేశంలో ఇప్పటివరకు 4లక్షల 10వేలకు పైగా కరోనా కేసులు నమోదవగా, వీరిలో ఇప్పటివరకు 2.27 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. 1.69 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి . ఇప్పటివరకు 13,254 మంది చనిపోయారు