కరోనా వైరస్ను నియంత్రించడానికి టీకాలు కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు జరుపుతూనే ఉన్నాయి. ఇటువంటి తరుణంలో కరోనాను నియంత్రించే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘జనతా కర్ఫ్యూ’ను విధించాయి. దేశ ప్రజలంతా ఆదివారం స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలోకి పాల్గొనేందుకు అన్నివిధాలుగా సిద్ధమయ్యారు. మార్చి 22 ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు ఎవ్వరూ కూడా ఇంటి నుంచి బయటకు రావొద్దని అధికారులు ఇప్పటికే ఆదేశాలిచ్చారు.
ఆ 14 గంటలు ఏం జరగబోతుంది? రోజు మొత్తం ఎలా ఉండబోతుంది. అంతా ఊహించినట్లు హెలికాప్టర్ల ద్వారా ఆకాశంలో క్రిమిసంహారక మందులు చల్లుతారా..? ఆ కారణంగానే బయటకు రావొద్దంటున్నారా..? అందరి మదిని తొలిచివేస్తున్న ప్రశ్నలివే. వీటికి సమాధానాలు కూడా ఉన్నాయి.
అపోహలు:
హెలికాప్టర్ల ద్వారా కెమికల్స్ చల్లుతున్నారనేది రూమర్లు మాత్రమే. మునిసిపాలిటీ వాళ్లు రాత్రుల్లో క్రిమిసంహారక మందులు చల్లుతున్నారని, ఇది శరీరంపై పడితే వ్యాధులు వస్తాయని చెప్పడం నిజంకాదు. జనతా కర్ఫ్యూను పాటించకుండా బయటకు వస్తే మాత్రం.. ఒకవేళ ఎక్కడైరా కరోనా వైరస్ ఉంటే అంటువ్యాధిలా వ్యాపించే అవకాశం ఉంది. ఇది గంటల వ్యవధిలో వేలాది మందికి పాకే ప్రమాదం ఉంది.
ఆ 14 గంటలు ఎందుకంటే..
కరోనా వైరస్కు లైఫ్ టైం ఎక్కువకాలం ఉండదు. గాల్లో ఉండే కరోనా వైరస్ జీవితకాలం 12 గంటలు మాత్రమే ఉంటుంది. అదే సమయంలో ఇతరులకు వ్యాప్తి చెందకపోతే 14 గంటల పాటు ఇళ్లల్లో ఉండిపోవడం వల్ల కరోనా వైరస్ నశిస్తుంది. ఆదివారం 14 గంటలపాటు ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావొద్దని ప్రభుత్వాలు, అధికారులు ఆదేశాలు జారీచేశారు.
అసలు ఉద్దేశం
కరోనా వైరస్ ప్రస్తుతం మనదేశంలో రెండో దశలో ఉంది. మొదటి దశ విదేశాల నుంచి వచ్చినవాళ్లు ఈ వైరస్ బారినపడడం.. రెండో దశలో విదేశాల నుంచి వచ్చినవాళ్లు తిరిగిన ప్రాంతాల్లో వైరస్ గాల్లోనే ఉంటుంది. ఈ దశలోనే వైరస్ను అంతం చేయగలిగితే పెద్ద ముప్పు నుంచి తప్పుకున్నట్లే. మూడో దశకు చేరుకుంటే మరింత ప్రమాదకరంగా మారుతుంది.
గాల్లో ఉన్న వైరస్ మనుషుల్లోకి చేరడం.. వాళ్లు తుమ్మినప్పుడు, దగ్గినపుడు, చేతులు కలిపినపుడు అంటువ్యాధిలా అందరికీ వైరస్ పాకడం జరగుతుంది. ఫలితంగా నాలుగో దశలో ఊహించని విధంగా ప్రాణ నష్టం జరుగుతుంది. జనతా కర్ఫ్యూ ద్వారా 14 గంటల పాటు ఇంట్లోనే ఉంటే వైరస్కు లింకు బంధం తెగిపోతుంది. ఎక్కడికక్కడే అది తుడిచి పెట్టుకునిపోతుంది. ఇదే జనతా కర్ఫ్యూ ప్రధాన ఉద్దేశం.