Arvind Kejriwal : జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేం.. స్పష్టం చేసిన ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని ...
- Harishth Thanniru
- Published On : March 28, 2024 / 02:15 PM IST
Arvind Kejriwal
Arvind Kejriwal ED Remands : ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. ఈడీ అరెస్టు చేసినందున కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని సామాజికవేత్త సుర్జీత్ సింగ్ యాదవ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యంపై ఢిల్లీ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరాతో కూడిన డివిజన్ బెంచ్ సుర్జీత్ సింగ్ యాదవ్ పిటిషన్ ను కొట్టివేసింది. జైలు నుంచి ప్రభుత్వం నడపకుండా చూడటానికి న్యాయపరంగా అవకాశాలు లేవన్న హైకోర్టు.. న్యాయ వ్యవస్థ ముఖ్యమంత్రిని తొలగించే అంశంపై జోక్యం చేసుకోలేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
Also Read : పిల్లలను బెంగ పెట్టుకోవద్దని చెప్పండి.. ములాకత్లో భాగంగా తనను కలిసిన భర్తకు చెప్పిన కవిత
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను ఇటీవల ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. అయితే, ఈడీ కస్టడీలో ఉన్నప్పటికీ కేజ్రీవాల్ సీఎంగా కొనసాగుతున్నారు. ఈడీ కస్టడీ నుంచే పాలనాపరమైన ఆదేశాలు ఇస్తున్నారు. ఢిల్లీ సీఎంగా జైలులో ఉన్నా కేజ్రీవాలే కొనసాగుతారని ఆప్ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం జైలు నుంచి నడవదని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పేర్కొన్నారు. ఈ సమయంలోనే కేజ్రీవాల్ పై ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈడీ అరెస్టు చేసిన కారణంగా సీఎం పదవికి కేజ్రీవాల్ అనర్హుడని, ఆయన్ను వెంటనే ఢిల్లీ సీఎం పదవి నుంచి తప్పించాలని సామాజికవేత్త హైకోర్టులో పిల్ దాఖలు చేయగా.. హైకోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసింది.
