Alimony Case: ఓ విడాకుల కేసులో ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. భరణం విషయంలో భార్యకు షాక్ ఇచ్చింది. ఆర్ధికంగా స్వయం సమృద్ధి కలిగి, స్వతంత్రంగా ఉన్న భార్యకు భర్త భరణం చెల్లించాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. శాశ్వత భృతి అనేది సామాజిక న్యాయానికి ఒక సాధనం మాత్రమే అన్న న్యాయస్థానం.. సామర్థ్యం ఉన్న వ్యక్తుల మధ్య ఆర్థిక సమానత్వం లేదా ఆర్థిక సంపన్నత కోసం కాదని స్పష్టం చేసింది.
ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ లో గ్రూప్ ఏ ఆఫీసర్ గా పని చేస్తున్న మహిళ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన జస్టిస్ అనిల్ క్షేతర్పాల్, జస్టిస్ హరీశ్ వైద్యనాథన్ శంకర్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ వ్యాఖ్య చేసింది. శాశ్వత భరణం అనేది సామాజిక న్యాయం కోసం ఉద్దేశించిన చర్య అని.. ఇది ఇద్దరు సామర్థ్యం ఉన్న వ్యక్తుల ఆర్థిక స్థితిని సమానం చేయడానికి లేదా సంపదను పోగు చేసుకోవడానికి ఒక సాధనం కాదని బెంచ్ పేర్కొంది. భరణం కోరే వ్యక్తికి తనకు నిజంగా ఆర్థిక సాయం అవసరమని నిరూపించాల్సిన బాధ్యత ఉందని నొక్కి చెప్పింది.
2010 జనవరిలో పెళ్లి చేసుకున్న జంట 14 నెలల్లోనే విడిపోయింది. భర్త లాయర్ కాగా, భార్య రైల్వే ట్రాఫిక్ సర్వీస్ గ్రూప్ ఎ అధికారి. భార్య తనను మానసికంగా, శారీరకంగా హింసించిందని, వైవాహిక హక్కులను నిరాకరించిందని, వత్తిపరమైన, సామాజిక వర్గాల్లో తనను అవమానించిందని భర్త ఆరోపించారు. కేసును విచారించిన ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. అంతేకాకుండా రూ.50 లక్షలు ఇస్తానని అంటేనే విడాకులకు ఒప్పుకున్నానంటూ భార్య డిమాండ్ చేయడాన్ని గుర్తించిన ఫ్యామిలీ కోర్టు భరణం అభ్యర్థనను తిరస్కరించింది.
ఈ ఆదేశాన్ని సవాల్ చేస్తూ ఆ మహిళ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై జస్టిస్ అనిల్ క్షేతర్పాల్, హరీశ్ వైద్యనాథన్ శంకర్తో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. కింది కోర్టు తీర్పులో తప్పులేదని అభిప్రాయపడింది. ”విడాకులను వ్యతిరేకిస్తున్నట్లు చెబుతూనే, భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడం.. ఆ బంధాన్ని నిలబెట్టుకోవాలనే ప్రేమ, ఆప్యాయతతో కాదని, కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసమేనని స్పష్టమవుతోంది. భార్య వైఖరిలో స్పష్టమైన ఆర్థిక కోణం ఉందని ఫ్యామిలీ కోర్టు తేల్చడం సమంజసమే’ అని ధర్మాసనం పేర్కొంది.
భార్య ఒక సీనియర్ ప్రభుత్వ ఆఫీసర్ గా మంచి ఆదాయం సంపాదిస్తోంది. కాబట్టి ఆమె ఆర్థికంగా స్వతంత్రురాలని కోర్టు నిర్ధారించింది. హిందూ వివాహ చట్టం సెక్షన్ 25 కింద జీవనాధార భృతి కోరుకునే వ్యక్తి ఆర్థిక అవసరాన్ని నిరూపించాలని, ఆమె అలాంటి అవసరాన్ని నిరూపించలేకపోయిందని పేర్కొంది. ఆర్థికంగా స్వతంత్రంగా, స్వయం సమృద్ధిగా ఉన్నప్పుడు భరణం మంజూరు చేయలేము అని తేల్చి చెప్పింది.