National Doctors Day 2023 : డాక్టర్ బిసి రాయ్ సేవలు గుర్తు చేసుకుందాం .. హ్యాపీ డాక్టర్స్ డే
కనిపించే దేవుడు వైద్యుడు. మన ప్రాణాల్ని కాపాడటానికి అహరహం పనిచేసే వైద్యుల సేవలకు ఏమిచ్చినా రుణం తీరదు. భారత దేశానికి ఎన్నో వైద్య సేవలు అందించిన డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జనన, మరణ వార్షికోత్సవాన్ని 'అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం'గా జరుపుకుంటున్నాం. ఆయన సేవల్ని స్మరిస్తూ వైద్యులందరికీ శుభాకాంక్షలు చెబుదాం.
- Lakshmi 10tv
- Published On : July 1, 2023 / 11:46 AM IST
National Doctors Day 2023
National Doctors Day 2023 : కనిపించని దైవాన్ని పూజిస్తాము. కనిపించే దైవంగా డాక్టర్లను భావిస్తాము. నిత్యం రకరకాల అనారోగ్యాలు, యాక్సిడెంట్లతో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆసుపత్రులకు వచ్చే వేలాది పేషెంట్ల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా డాక్టర్లు పని చేస్తారు. పగలు, రాత్రి ప్రజా సేవకే తమ జీవితాన్ని అంకితం చేస్తారు. ఈరోజు భారతదేశం ‘అంతర్జాతీయ వైద్యుల దినోత్సవాన్ని’ జరుపుకుంటోంది. అయితే గొప్ప వైద్యులు, రాజకీయ వేత్త, అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అందుకున్న వ్యక్తి డాక్టర్ బిసి రాయ్ జ్ఞాపకార్థం ఈ దినోత్సవాన్ని జరుపుతారు.
ఈరోజు అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం. భారతదేశం మొత్తం ఈరోజు డాక్టర్ బిసి రాయ్కి నివాళులు అర్పిస్తుంది. ఆయన 1882 జూలై 1 న జన్మించారు. 1962 జూలై 1న మరణించారు. ఆయన జన్మదిన మరియు మరణ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జూలై 1న ‘జాతీయ వైద్యుల దినోత్సవాన్ని’ జరుపుకుంటారు.
డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ గొప్ప వైద్యుడు మరియు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. తన FRCS మరియు MRCP పూర్తి చేసిన తర్వాత, డాక్టర్. రాయ్ మెడిసిన్ ప్రొఫెసర్గా, అమెరికన్ సొసైటీ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ అండ్ హైజీన్ సభ్యుడుగా మరియు కోల్కతా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. రాయ్ సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తెచ్చారు. కోల్ కతాలో RG వంటి కొన్ని వైద్య సంస్థలను స్ధాపించారు. కార్ మెడికల్ కాలేజీ, జాదవ్ పూర్ TB హాస్పిటల్, చిత్తరంజన్ సేవా సదన్, కమలా నెహ్రూ హాస్పిటల్, విక్టోరియా ఇన్స్టిట్యూషన్ మరియు చిత్తరంజన్ క్యాన్సర్ హాస్పిటల్ రాయ్ చేత ప్రారంభించబడినవే.
Corona Vaccination : వ్యాక్సిన్ ఇచ్చేందుకు పెద్ద సాహసమే చేసిన వైద్యులు.. వీడియో వైరల్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, ఇన్ఫెక్షియస్ డిసీజ్ హాస్పిటల్ మరియు కోల్కతాలో మొట్టమొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కాలేజీని స్థాపించడంలో రాయ్ కీలక పాత్ర పోషించారు. కోల్కతా కార్పొరేషన్ మేయర్గా ఉన్న సమయంలో ఉచిత విద్య, వైద్య సాయం, మరుగుదొడ్లు, వీధి దీపాలు, నీటి సరఫరా వంటివి ప్రజలకు అందించడంలో సాయపడ్డారు. పశ్చిమ బెంగాల్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రం శాంతి భద్రతలు కాపాడటంలో తనవంతు పాత్రను పోషించారు. దుర్గాపూర్, బిధాన్ నగర్, అశోక్ నగర్, హబ్రా నగరాలకు ఆయనే పునాది వేశారు. 1961 లో తన ఇంటిని సైతం ఆయన ప్రజలకు బహుమతిగా ఇచ్చారు. భారత ప్రభుత్వం 1961 ఫిబ్రవరి 4 న ఆయనను అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’తో గౌరవించింది.
బిసి రాయ్ వైద్యరంగంలో చేసిన సేవలకు గాను 1976 లో ‘రాయ్ జాతీయ అవార్డు’ను స్ధాపించారు. ఆయన సేవల్ని స్మరిస్తూ ఏటా జూలై 1 న ‘జాతీయ వైద్యుల దినోత్సవాన్ని’ జరుపుతారు. ప్రజారోగ్యమే ధ్యేయంగా, జీవితంగా గడిపే వైద్యులందరికీ జాతీయ వైద్య దినోత్సవ శుభాకాంక్షలు.
