Excise Policy Case: "Not the first case of corruption against AAP...", Union Minister Anurag Thakur
Excise Policy Case: కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఢిల్లీ మంత్రుల ఇళ్ళు, కార్యాలయాలపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోందంటూ సీఎం కేజ్రీవాల్ చేసిన ఆరోపణలకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంటిపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అధికారులు సోదాలు చేస్తోన్న విషయం తెలిసిందే. అలాగే, ఢిల్లీలోని మరో 20 ప్రాంతాల్లో సీబీఐ దాడులు కొనసాగుతున్నాయి. దీనిపై అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ… అవినీతికి పాల్పడిన వారు తాము అమాయకులమని రుజువు చేసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, వారు ఎప్పటికీ అవినీతిపరులుగానే మిగిలిపోతారని చెప్పారు.
ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతికి పాల్పడడం ఇది తొలిసారి కాదని అన్నారు. ఢిల్లీలో మద్యం విధానంలో చాలా అవినీతి జరిగిందని ఆరోపించారు. మద్యం విధానంపై సీబీఐ విచారణకు ఆదేశాలు వచ్చినరోజే ఢిల్లీ సర్కారు ఆ పాత విధానాన్ని ఉపసంహరించుకుందని చెప్పారు. మద్యం విధానంలో కుంభకోణం లేకపోతే ఆ పాలసీని ఎందుకు ఉపసంహరించుకున్నారని ఆయన నిలదీశారు.
అవినీతి కేసులో మంత్రి సత్యేంద్ర జైన్ జైలుకి వెళ్ళినప్పటికీ ఆయనను మంత్రి పదవి నుంచి ఎందుకు తొలగించలేదని ఆయన నిలదీశారు. కాగా, ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయని బీజేపీ మొదటి నుంచి ఆరోపణలు చేస్తోంది. తాను సీబీఐ విచారణకు సహకరిస్తానని, తనకు వ్యతిరేకంగా వారు ఏమీ గుర్తించలేరని మనీశ్ సిసోడియా అన్నారు. మనీశ్ సిసోడియాను కూడా కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేయించే అవకాశం ఉందని అరవింద్ కేజ్రీవాల్ కొన్ని రోజులుగా అంటున్నారు.