GN Saibaba Acquitted In Maoist Links Case : మావోయిస్టులతో లింక్ కేసులో మాజీ ప్రొఫెసర్ జీఎన్.సాయిబాబా నిర్దోషి.. జైలు నుంచి విడుదల చేయాలని బాంబే హైకోర్టు ఆదేశం
ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మావోయిస్టులతో సంబంధాల కేసులో మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను నిర్దోషిగా పేర్కొంటూ బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ శుక్రవారం తీర్పు ఇచ్చింది.
- bheemraj
- Updated on- October 14, 2022 / 01:22 PM IST
gn saibaba acquitted
GN Saibaba Acquitted In Maoist Links Case : ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్.సాయిబాబా కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మావోయిస్టులతో సంబంధాల కేసులో మాజీ ప్రొఫెసర్ జీఎన్.సాయిబాబాను నిర్దోషిగా పేర్కొంటూ బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ శుక్రవారం అక్టోబర్(14,2022) తీర్పు ఇచ్చింది. సాయిబాబాను జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.
తనకు జీవిత ఖైదు విధిస్తూ ట్రయల్ కోర్టు 2017వ సంవత్సరంలో ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ జిఎన్ సాయిబాబా దాఖలు చేసిన అప్పీల్ను జస్టిస్ రోహిత్ డియో, అనిల్ పన్సారేలతో కూడిన డివిజన్ బెంచ్ అనుమతించింది. శారీరక వైకల్యం కారణంగా వీల్చైర్లో ఉన్న జీఎన్.సాయిబాబా ప్రస్తుతం నాగ్పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు.
కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ), ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)లోని వివిధ నిబంధనల ప్రకారం జీఎన్. సాయిబాబా, ఇతరులను గతంలో కోర్టు దోషులుగా నిర్ధారించింది. అనంతరం ఈ కేసులో మరో ఐదుగురు దోషుల అప్పీల్ను కూడా హైకోర్టు ధర్మాసనం అనుమతించి వారిని నిర్దోషులుగా ప్రకటించింది.
ఐదుగురిలో ఒకరు అప్పీలు విచారణలో ఉండగానే మృతి చెందారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని సెషన్స్ కోర్టు 2017 మార్చి నెలలో సాయిబాబా, ఇతరులను దోషులుగా నిర్ధారించిన విషయం తెలిసిందే. తాజాగా జీఎన్.సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ.. జైలు నుంచి విడుదల చేయాలని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది.
