Gold Shop Bandu
gold shops closed : బంగారు నగలకు హాల్మార్క్ నమోదుకు సంబంధించి.. H.U.I.D నిబంధనలకు నిరసనగా దేశవ్యాప్తంగా నేడు బంగారం దుకాణాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఇవాళ ఒక్కరోజు మాత్రమే ఈ బంద్ జరుగుతోంది. బంగారం, జెమ్స్ దుకాణదారులుండే.. దాదాపు 350 అసోషియేషన్స్ ఈ బంద్లో పొల్గొననున్నాయి. దేశంలో గోల్డ్ హాల్మార్క్ను తప్పనిసరి చేస్తూ కేంద్రం జూన్ 16న నిబంధన పెట్టింది. దేశంలోని 256 జిల్లాల్లో దీన్ని అమలు చేస్తున్నట్టుగా ప్రకటించింది కేంద్రం.
అయితే ప్రతి నగకు హాల్మార్క్ యూనిటిక్ ఐడింటిఫికేషన్ నంబర్ తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో బంగారం వ్యాపారులు లక్షల ఆభరణాలను హాల్మార్క్ తనిఖీ కేంద్రాలకు తరలించి గుర్తింపు పొందాల్సి వస్తోంది. కొనుగోలు చేసిన, తయారు చేసిన ప్రతి ఆభరణానికి హాల్మార్క్ సర్టిఫికెట్ తీసుకోవడం.. తలకు మించిన భారంగా మారుతోంది. వ్యాపారులు తమ సమయాన్నంతా హాల్మార్క్ గుర్తింపు పొందడంపై వెచ్చించాల్సి వస్తోంది.
ఆభరణాలపై హాల్మార్క్ ముద్ర వేయించడం వ్యాపారులకు కష్టతరమైన అంశం. హాల్మార్క్ సెంటర్లు అందుబాటులో ఉన్న నగరాలు, పట్టణాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండకపోయినా.. చిన్న పట్టణాలు, గ్రామాల్లో బంగారం వ్యాపారులు అనేక ఇబ్బందులు పడాల్సివస్తోంది. తెలంగాణలో 33 జిల్లాల్లో 35 హాల్మార్క్ సెంటర్లు మాత్రమే ఉన్నాయి. ఈ హాల్మార్క్ సెంటర్లకు ప్రతిరోజూ వేలసంఖ్యలో బంగారు, వెండి ఆభరణాలు తరలిస్తున్నారు. ప్రతి నగకూ H.U.I.D కేటాయించడానికి సమయం పడుతోంది.
H.U.I.D నిబంధనల ప్రకారం.. ప్రతి బంగారు దుకాణ వ్యాపారి తప్పకుండా కంప్యూటర్ ఆపరేటర్, ప్రతి నగకు స్కానింగ్, అప్లౌడ్ చేసుకోవడం, విక్రయాల నమోదు చేయడం లాంటి వివరాలను నమోదు చేయలి. కానీ ఇది ఆర్థిక భారంగా మారుతుందని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు.
ప్రభుత్వం మాత్రం హాల్ మార్క్ అనేది వినియోగదారుడి భద్రతకోసమేనని చెబుతోంది. నాణ్యమైన బంగారు ఆభరణాల అమ్మకాన్ని ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామంటోంది. బంగారం బ్లాక్ మార్కెట్ ని తగ్గించేందుకే ఈ ప్రయత్నం అంటూ వివరణ ఇస్తోంది.