virendra sehwag
Haryana Election Results 2024: హరియాణాలో బీజేపీ మరోసారి విజయం దిశగా దూసుకెళ్తుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ హర్యానాలో బీజేపీ హవా కొనసాగిస్తుండటం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మెజార్టీ సర్వే సంస్థలు బీజేపీ ఓడిపోతుందని తమ అంచనాలను వెల్లడించాయి. ఇదిలాఉంటే.. హర్యానాలో భారత్ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కాంగ్రెస్ అభ్యర్ధి అనిరుధ్ చౌదరి విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారంలో పాల్గొన్నారు. తోషం నియోజకవర్గం నుంచి అనిరుధ్ చౌదరి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. బీజేపీ అభ్యర్ధిగా శృతి చౌదరి పోటీ చేశారు. ఈ నియోజకవర్గంలో 62శాతం పోలింగ్ నమోదైంది.
Also Read: Election Results 2024: హరియాణాలో బీజేపీ హవా.. జమ్మూకశ్మీర్ లో ఎన్సీ కూటమి ఆధిక్యం.. Live Blog
అనిరుధ్ కి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న సెహ్వాగ్ మాట్లాడుతూ.. అనిరుధ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. ప్రజలకు అనిరుధ్ ఇచ్చిన వాగ్దానాలను ఖచ్చితంగా అమలు చేస్తారని, అతనికి పరిపాలన అనుభవం ఉందని సెహ్వాగ్ చెప్పారు. తోషం ప్రజలు అనిరుధ్ ను గెలిపించుకుంటే మీకు అండగా ఉంటారని.. అన్నివిధాల భరోసా కల్పిస్తారని, ప్రజలు ఆయన్ను గెలిపించాలని సెహ్వాగ్ కోరారు.
అయితే, సెహ్వాగ్ ప్రచారం చేసిన కాంగ్రెస్ అభ్యర్ధి ఓటమి దిశగా పయణిస్తున్నారు. ఆ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధి శృతి చౌదరి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 13వ రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యే సరికి శృతి చౌదరి 11,566 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.