Bihar Assembly Election: బిహార్లో గత ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు గెలుచుకున్న ఓ పార్టీ ఇప్పుడు 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఏపీలోనూ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే గెలిచుకుని, 2024 ఎన్నికల్లో పోటీ చేసిన 21 సీట్లలోనూ గెలిచిన విషయం తెలిసిందే.
బిహార్లో యువనేత చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 29 స్థానాల్లో పోటీచేసి 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దీంతో ఎన్డీఏలో తన స్థానాన్ని మరింత బలపరుచుకున్నారు. 66 శాతం స్ట్రైక్ రేట్ సాధించే అవకాశం ఉంది. (Bihar Assembly Election)
కాగా, 2021లో తన బాబాయ్ పశుపతి పరాస్తో చిరాగ్కు విభేదాలు వచ్చాయి. ఆ పార్టీలో పశుపతి చీలిక తీసుకువచ్చి, పార్టీ లోక్సభ సభ్యుల్లోని ఐదుగురిలో నలుగురిని తనవైపు తిప్పుకున్నారు. ఆ తర్వాత ఎల్జేపీ (ఆర్వీ) ఏర్పడింది.
Also Read: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ రౌడీ సినిమా సీన్.. జైలు నుంచి విక్టరీ.. అనుచరులు రచ్చరచ్చ
పార్టీ వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాస్వాన్ మరణించిన సంవత్సరం గడవకముందే ఇది జరిగింది. రామ్ విలాస్ పాస్వాన్ నేతృత్వంలో 2005 ఫిబ్రవరిలో ఎల్జేపీ 29 స్థానాలు గెలుచుకుంది. ఆ పార్టీకి దక్కిన అత్యధిక సీట్లు అవే. మళ్లీ ఇప్పుడు ఎల్జేపీ (ఆర్వీ) 19 స్థానాల్లో విజయం దిశగా దూసుకెళుతోంది.
నితీశ్ కుమార్ పట్ల చిరాగ్ పాస్వాన్ తన తండ్రిలాగే వ్యతిరేక వైఖరిని కొనసాగించారు. 2020లో ఆయన ప్రచారం “మోదీ సె బయర్ నహీ, నితీశ్ తేరీ ఖైర్ నహీ” నినాదంతో జరిగింది. 143 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టారు. కానీ, ఎల్జేపీ ఒక్క స్థానమే గెలిచింది. ఆ ఒక్క ఎమ్మెల్యే కొన్ని నెలల్లోనే జేడీయూలో చేరారు. 2025 ఎన్నికల్లో మొదటిసారి ఎల్జేపీ, జేడీయూ ఒకే కూటమిలో కలిసి పోటీ చేశాయి. బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ తిరుగులేని విజయాన్ని సాధించింది.