Supreme Court :కరోనా వల్ల అనాథలైన పిల్లల్ని గుర్తించటంలో ఆలస్యం చేయొద్దు
కోవిడ్ వల్ల అనాథలుగా మారిన పిల్లల్ని గుర్తించటంలో ఏమాత్రం ఆలస్యం చేయవద్దని సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాలకు సూచించింది. అనాథ పిల్లలను సాధ్యమైన త్వరగా గుర్తించాలని సూచించింది. ఈ ప్రక్రియలో ఆలస్యం చేయవద్దని స్పష్టంచేసింది.
- nagamani
- Published On : July 28, 2021 / 12:37 PM IST
No Delay In Identification Of Covid Orphans Supreme
no delay in identification of covid orphans supreme : కరోనా మహమ్మారి వల్ల ఎంతోమంది చిన్నారులు అనాథలుగా మారారు. తల్లిదండ్రుల్ని కోల్పోయినవారు కొందరైతే మరికొందరు తల్లిని గానీ లేక తండ్రిని గానీ కోల్పోయిన క్రమంలో మిగిలినవారు పట్టించుకోక అనాథలైనవారు వేలాదిమంది ఉన్నారు. అటువంటివారిని గుర్తించి వారికి అండగా నిలుస్తామని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం కూడా అనాథ పిల్లలకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో కోవిడ్ వల్ల అనాథలుగా మారిన పిల్లల్ని గుర్తించటంలో ఏమాత్రం ఆలస్యం చేయవద్దని సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాలకు సూచించింది. అనాథ పిల్లలను సాధ్యమైన త్వరగా గుర్తించాలని సూచించింది. ఈ ప్రక్రియలో ఆలస్యం చేయవద్దని స్పష్టంచేసింది.
అనాథ పిల్లల వివరాలతో తాజా నివేదికలను సమర్పించాల్సిందిగా ద్విసభ్య ధర్మాసనం మంగళవారం (జులై 27,2021) అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. గత సంవత్సరం మార్చి నుంచి కొవిడ్ కారణంగా తల్లిని లేదా తండ్రిని కోల్పోయిన లేదా మొత్తానికి అనాథలైన వారి వివరాలు పంపాలని ధర్మాసనం తెలిపింది. ఈ అనాథల కోసం ప్రభుత్వం అమలుచేసే పథకాలు కాగితాలకే పరిమితం కాకుండా చూడాలని..అమలు జరిగేలా చూడాలని ధర్మాసనం పేర్కొంది. గత సంవత్సరం మార్చి నుంచి కొవిడ్ వల్ల అనాథలైనా లేదా ఇతర కారణాల వల్ల అనాథలైనా ఆయా పిల్లలందరికీ సుప్రీంకోర్టు ఉత్తర్వులు వర్తిస్తాయని న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు,అనిరుద్ధ బోస్ స్పష్టం చేశారు.
