Mann Ki Baat: భారతదేశం ఆర్థిక ప్రగతి దిశగా భారీ అడుగులు వేస్తోంది: ప్రధాని మోదీ
కరోనా వంటి విపత్కర పరిస్థితులు దాటుకుంటూ భారత దేశం ఆర్ధిక ప్రగతి దిశగా వేగంగా అడుగులు వేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
- Bharath Reddy
- Published On : March 27, 2022 / 12:54 PM IST
Modi
Mann Ki Baat: కరోనా వంటి విపత్కర పరిస్థితులు దాటుకుంటూ భారత దేశం ఆర్ధిక ప్రగతి దిశగా వేగంగా అడుగులు వేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. “మన్ కీ బాత్” 87వ ఎపిసోడ్ ద్వారా ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఇటీవల నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం మొదటిసారి నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రస్తుతం భారత్ నుంచి $400 బిలియన్ డాలర్ల వ్యాపార ఎగుమతులు చోటుచేసుకుంటున్నాయని ఇది భారత ఆర్ధిక రంగానికి ఊతమిచ్చే అంశమని అన్నారు. “భారతదేశం నుండి కొత్త ఉత్పత్తులు కొత్త గమ్యస్థానాలకు ఎగుమతి చేయబడుతున్నాయి, ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులు ఇప్పుడు విదేశాలలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇది దేశం యొక్క శక్తిసామర్థ్యాన్ని సూచిస్తుంది” అని మోదీ వ్యాఖ్యానించారు.
Also read:Noisy Cities: ప్రపంచంలో రెండవ అత్యంత శబ్ద కాలుష్య నగరం మొరాదాబాద్: జాబితాలో ఢిల్లీ, కోల్కతా కూడా
భారత్ లోని ప్రతి పౌరుడు స్థానిక ఉత్పత్తులను ఆదరిస్తే..దేశం ఎగుమతుల లక్ష్యాన్ని సాధించడం పెద్ద కష్టమేమి కాదని మోదీ అన్నారు. ఈసందర్భంగా “వోకల్ ఫర్ లోకల్” నినాదానికి ఊతమిచ్చేలా రైతులు, యువత మరియు చిన్నమధ్యతరహా పరిశ్రమలు ఆదర్శంగా నిలుస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. ఎగుమతుల అంశం గతంలో పెద్ద సంస్థలకు మాత్రమే సాధ్యమయ్యే విషయంగా భావించేవారని..కానీ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన “గవర్నమెంట్ ఈ-మార్కెట్ ప్లేస్” (GeM portal) ద్వారా ఇపుడు ప్రతిఒక్క ఉత్పత్తిదారుడు ఎగుమతులు చేసుకోవచ్చని ప్రధాని అన్నారు.
ఇటీవల పద్మా అవార్డుల ప్రదానోత్సవంలో యోగా గురువు బాబా శివానందను చూసి అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారని..ఈ వయసులోనూ ఆయన ఆరోగ్యం, శారీరక దృఢత్వం యోగాతోనే సాధ్యమైందని తెలిపినట్లు ప్రధాని మోదీ వివరించారు. శివానంద బాబా వంటి వారి అనుసరణ కారణంగానే నేడు యోగా భారత్ నుంచి ఖండాంతరాలకు విస్తరించిందని మోదీ వివరించారు. అదే సమయంలో ఆరోగ్య రంగంలో ఇటీవల ఆయుర్వేదానికి ప్రాధాన్యత పెరిగిందని.. అనేక చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఈ రంగంలో వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకున్నట్లు మోదీ తెలిపారు.
Also read:Petrol In India : కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే
గుజరాత్ కోస్తా తీరంలో జరిగే అద్భుతమైన ఉత్సవాలు “ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్”ను ప్రతిబింబిస్తుందని మోదీ తెలిపారు. గుజరాత్ లో పుట్టిపెరిగిన తనకు అక్కడి నీటి ఎద్దడి గురించి అవగాహన ఉందన్న ప్రధాని మోదీ, జల్ మందిర్ యోజన కార్యక్రమం ద్వారా ప్రతి నీటిబొట్టుని ఒడిసిపట్టి గుజరాత్ లో నీటి కరువును అధిగమిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి రాష్ట్రం ఆదర్శంగా తీసుకోవాలని మోదీ పేర్కొన్నారు. ఇక చివరగా భారత్ లో బాలికా చదువును, మహిళా సాధికారతను మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజలకు సూచించారు.
