Ayodhya Ram temple : అయోధ్య రామ మందిరం ప్రారంభానికి చిరంజీవి, అమితాబ్, రజనీలతో పాటు.. ప్రముఖులకు ఆహ్వానం
2024 జనవరి 22 న అయోధ్య రామ మందిర ప్రారంభానికి హాజరుకావాల్సిందిగా పలువురు సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. వీరిలో బాలీవుడ్, టాలీవుడ్తో పాటు పలు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు ఉన్నారు.
- Lakshmi 10tv
- Published On : December 17, 2023 / 12:25 PM IST
Ayodhya Ram temple
Ayodhya Ram temple : అయోధ్యలో రామమందిర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 31 నాటికి పనులు పూర్తి కావచ్చని తెలుస్తోంది. 2024 జనవరి 22 న ఈ ఆలయం అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతోంది. ఈ వేడుకకు పలువురు రాజకీయ, మత పెద్దలతో పాటు సినీ ప్రముఖులు హాజరుకాబోతున్నారు. ఇప్పటికే వీరికి ఆహ్వానాలు అందాయి.
West Bengal : అయోధ్య ఆలయం కోసం రాముడి విగ్రహాన్ని తయారు చేస్తున్న ముస్లిం శిల్పులు
అయోధ్యలో రామ మందిర ప్రారంభానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు మత పెద్దలకు ఆహ్వానాలు పంపినట్లు ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ చెప్పారు. 2024 జనవరి 22 జరగనున్న ఈ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, చిరంజీవి, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ధనుష్, రిషభ్ శెట్టి, అనుపమ్ ఖేర్, మాధురీ దీక్షిత్లకు ఆహ్వానాలు అందాయి. వీరితో పాటు.. అజయ్ దేవగన్, సన్నీ డియోల్, ప్రభాస్, రణబీర్ కపూర్, అలియా భట్, ఆయుష్మాన్ ఖురానా, టైగర్ ష్రాఫ్, యష్.. ఇలా మరికొంతమంది సినీ ప్రముఖులకు కూడా ఆహ్వానాలు అందినట్టు సమాచారం.
సినీ నటులతో పాటు ప్రముఖ దర్శకులు రాజ్ కుమార్ హిరానీ, సంజయ్ లీలా బన్సాలీ, రోహిత్ శెట్టి, నిర్మాత మహావీర్ జైన్లు ఆహ్వానం అందుకున్నారు. ఈ వేడుకకు అన్ని వర్గాలకు చెందిన 4,000 మంది సాధువులను కూడా ట్రస్ట్ ఆహ్వానించింది. మందిర ప్రారంభానికి వారం ముందే అంటే జనవరి 16 నుండి వైదిక ఆచారాలు ప్రారంభమవుతాయి. వారణాసికి చెందిన వేద పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ జనవరి 22 న రాముని విగ్రహానికి పట్టాభిషేకం చేసి ప్రధాన ఆచారాలను నిర్వహిస్తారు. జనవరి 14 నుండి జనవరి 22 వరకు అయోధ్యలో అమృత్ మహోత్సవం జరగనుంది. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ప్రకారం ఈ కార్యక్రమం కోసం 10,000-15,000 మందికి ఏర్పాట్లు చేస్తున్నారు.
