Dowry Dispute: ఎంతకు తెగించార్రా..! పాపం.. అదనపు కట్నంకోసం కోడలిని గదిలో వేసి పామును వదిలారు.. చివరిలో బిగ్ ట్విస్ట్..
కాన్పూర్లో దారుణం చోటుచేసుకున్నది. అదనపు కట్నం (Dowry Dispute) తేలేదని కోడలిని గదిలో బంధించిన అత్తమామలు.. అందులో పామును వదిలారు.
- Harishth Thanniru
- Published On : September 22, 2025 / 05:24 PM IST
Dowry Dispute
Dowry Dispute: అదనపు కట్నంకోసం వేధింపులకు గురవుతున్న మహిళల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గత నెల గ్రేటర్ నోయిడాలో అదనపు కట్నం కోసం అత్తామామలు, భర్త ఓ మహిళను చిత్రహింసలకు గురిచేశారు. అంతటితో ఆగక ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, తాజాగా.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్లో అదనపు కట్నం కోసం భర్త, అతని కుటుంబ సభ్యులు మహిళను చిత్రహింసలకు గురిచేశారు. ఆమెను గదిలో బందించి పామును వదిలారు. పాము కాటుకు గురైన మహిళ.. చివరికి ఎలాగోలా తప్పించుకొని ప్రాణాపాయం నుంచి బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కాన్పూర్లోని కలోనల్గంజ్కు చెండిన రేష్మకు 2021మార్చి 19వ తేదీన షానవాజ్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన నెల రోజుల నుంచే భర్త, అతని కుటుంబ సభ్యులు రేష్మను అదనపు కట్నంకోసం వేధించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో పలుసార్లు చిత్రహింసలకు గురిచేశారు. దీంతో రేష్మ తల్లిదండ్రులు రూ.1.5లక్షలు కట్నంగా చెల్లించారు. అయితే, మరో రూ.5లక్షలు అదనపు కట్నం తేవాలంటూ భర్త, అత్తమామలు రేష్మను వేధింపులకు గురిచేస్తున్నారు.
అదనపు కట్నం తేవడం లేదని ఈనెల 18వ తేదీన రేష్మను భర్త, అత్తమామలు ఓ గదిలో బంధించారు. ఆ గదిలోకి పామును వదిలారు. రేష్మను పాము కాటువేయడంతో పెద్దగా ఏడుస్తూ కేకలు వేసింది. అయినా భర్త, అత్తమామలు తలుపులు తీయలేదు. ఏదో విధంగా రేష్మ ఫోన్ ద్వారా తన సోదరి రిజ్వానాకు విషయాన్ని తెలియజేసింది. వెంటనే రిజ్వానా తన సోదరి ఇంటి వద్దకు వెళ్లి చూడగా.. తన పరిస్థితి విషమంగా మారింది. వెంటనే ఆమెను వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.
ఈ ఘటనపై రిజ్వానా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రేష్మ భర్త షానవాజ్, అతని తల్లిదండ్రులు, అన్నయ్య, సోదరితోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. నేరపూరిత హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
