Lok Sabha Elections 2024
Lok Sabha Elections 2024 : దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు, నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం ఏడు దశల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తిచేసేందుకు షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. బుధవారం తొలి దశ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ సహా 21 రాష్ట్రాల్లో పోటీచేసే అభ్యర్థులు బుధవారం నుంచి నామినేషన్ వేయనున్నారు.
Also Read : Telangana Congress : ఎన్నికల వేళ కాంగ్రెస్లో పదవుల చిచ్చు.. సీనియర్లు సీరియస్
మొదటి దశలో మొత్తం 102 లోక్ సభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా.. బుధవారం నుంచి మార్చి 27వ తేదీ (బీహార్ రాష్ట్రంలో 28వ తేదీ) వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. మార్చి 28న (బీహార్ రాష్ట్రంలో మార్చి 30) నామినేషనల్ పరిశీలన ఉంటుంది. అదేవిధంగా మార్చి 30న (బీహార్ రాష్ట్రంలో ఏప్రిల్ 2) నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఏప్రిల్ 19న 102 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
2024 లోక్ సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలిదశలో జరిగే ఎన్నికల్లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రెండు, అస్సాంలో నాలుగు, మణిపూర్ లో రెండు, మేఘాలయలో రెండు, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అడమాన్, నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరిలలో ఒక్కో స్థానంకు, అదేవిధంగా తమిళనాడులో 39, రాజస్థాన్ రాష్ట్రంలో 12, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిది, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆరు, మహారాష్ట్రలో ఐదు, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఐదు, బీహార్ లో నాలుగు, పశ్చిమ బెంగాల్ లో మూడు స్థానాల్లో ఎన్నికల ప్రక్రియకు నోటిఫికేషన్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది.