Tamil Nadu Politics: పళనిస్వామి గుప్పెట్లోకి అన్నాడీఎంకే పగ్గాలు .. సుప్రీకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైన పన్నీరు సెల్వం
తమిళనాడు అన్నాడీఎంకే లో పళనిస్వామి వర్సెస్ పన్నీరు సెల్వం వర్గీయుల మధ్య రగడ కొనసాగుతూనే ఉంది. అన్నాడీఎంకేను పూర్తిస్థాయిలో హస్తగతం చేసుకొనేందుకు ఇద్దరు నేతలు పావులు కదుపుతున్నారు. తాజాగా మద్రాస్ హైకోర్టులో పళని స్వామికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ పన్నీరు సెల్వం సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
- Harishth Thanniru
- Published On : September 3, 2022 / 09:25 AM IST
Tamil Nadu politics
Tamil Nadu Politics: తమిళనాడు అన్నాడీఎంకే లో పళనిస్వామి వర్సెస్ పన్నీరు సెల్వం వర్గీయుల మధ్య రగడ కొనసాగుతూనే ఉంది. అన్నాడీఎంకేను పూర్తిస్థాయిలో హస్తగతం చేసుకొనేందుకు ఇద్దరు నేతలు పావులు కదుపుతున్నారు. ఒకరిపై ఒకరు పైచేయి సాధిస్తూ పార్టీ పగ్గాలు చేజిక్కుంచుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి ఎంపికకు మద్రాసు హైకోర్టు పరోక్షంగా పచ్చజెండా ఊపింది. దీంతో అన్నాడీఎంకే బాధ్యతలు పళనిస్వామి గుప్పెట్లోకి చేరాయి. అయితే మద్రాసు హైకోర్టు ద్విసభ్య బెంచ్ తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లేందుకు పన్నీరు సెల్వం సిద్ధమయ్యారు.
Tamil Nadu CM Stalin: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ… ఏమన్నారంటే?
తమిళనాడు అన్నాడీఎంకేలో రచ్చ కొనసాగుతూనే ఉంది. పార్టీ పగ్గాలను దక్కించుకొనేందుకు పన్నీరు సెల్వం, పళనిస్వామిలు పోటీపడుతున్నారు. జూలై 11న జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం ద్వారా పళనిస్వామి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. దీన్ని వ్యతిరేకిస్తూ పన్నీరు సెల్వం దాఖలు చేసిన పిటీషన్ ను గత నెల న్యాయమూర్తి జయచంద్రన్ బెంచ్ విచారించింది. సర్వసభ్య సమావేశానికి సింగిల్ బెంచ్ స్టే విధించింది. జూన్ 23వ తేదీకి ముందు అన్నాడీఎంకేలో ఉన్న పరిస్థితులు కొనసాగే విధంగా ఉత్వర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో పళని స్వామి శిబిరానికి పన్నీరు సెల్వం చెక్ పెట్టినట్లయింది.
సింగిల్ బెంచ్ విధించిన స్టే కు వ్యతిరేకంగా పళనిస్వామి మద్రాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటీషన్ పై న్యాయమూర్తులు దురైస్వామి, సుందర మోహన్ బెంచ్ విచారణ జరిపి తీర్పు ఇచ్చింది. 128 పేజీలతో కూడిన తీర్పును న్యాయమూర్తులు వెలువరించారు. ఈ తీర్పులో సింగిల్ బెంచ్ విధించిన స్టేను రద్దు చేసిన హైకోర్టు, జూలై 11న జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశాన్ని ఆమోదించింది. దీంతో తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళని స్వామికి హైకోర్టు ద్విసభ్య బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది. అయితే పన్నీరు సెల్వం వర్గంమాత్రం ఈ తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం పన్నీరు సెల్వం వెంట దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ, ఆమె ప్రతినిధి ధినకరన్ ఉన్నారు.
