Manipur : నా కుటుంబం భవిష్యత్తు తెలియడం లేదు.. మొదటిసారి మీడియా ముందుకు మణిపూర్ బాధితురాలి తల్లి
మణిపూర్ వీడియో ఘటనకు సంబంధించి ఒక బాధితురాలి తల్లి మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనకు ముందు తన భర్తను, కొడుకును దారుణంగా హతమార్చిన విషయం ప్రస్తావించారు. తన కుటుంబ భవిష్యత్ ఏంటో అర్ధం కావట్లేదని తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
- Lakshmi 10tv
- Published On : July 22, 2023 / 05:01 PM IST
Manipur Victim
Manipur Woman : మణిపూర్ వీడియో ఘటనకు సంబంధించిన ఇద్దరు బాధితురాళ్లలో ఒక మహిళ తల్లి మీడియా ఎదుట స్పందించారు. ఘటనకు ముందు తన భర్తను, కొడుకును కిరాతకంగా హతమార్చిన సంఘటనను గుర్తుచేసుకున్నారు. తమ కుటుంబ భవిష్యత్ ఏంటో అర్ధం కావట్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ తమ గ్రామానికి తిరిగి వెళ్లాలనుకోవడం లేదని వెల్లడించారు.
West Bengal : బెంగాల్లోనూ మణిపూర్ తరహా ఘటన…ఇద్దరు మహిళలను కొట్టి అర్ధనగ్నంగా ఊరేగించారు…
లోయ-మెజారిటీ మెయిటీస్, కొండ-మెజారిటీ కుకీ తెగల మధ్య ఘర్షణలు చెలరేగిన మర్నాడు అంటే మే 4 న మణిపూర్లో పురుషుల గుంపు ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించి అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఊరేగింపుకు ముందర బాధిత మహిళల్లో ఒకరి తండ్రిని, తమ్ముడిని దారుణంగా హతమార్చారు. ఆ తరువాత ఇద్దరి మహిళలపై దారుణ కాండ జరిపారు. ఈ ఘటనపై ఆ బాధిత మహిళ తల్లి మొదటిసారి మీడియా ముందు మాట్లాడారు.
తన భర్తను, 12 వ తరగతి చదువుతున్న తన కొడుకును దారుణంగా హతమార్చారని.. పెద్ద కొడుకుకి ఉద్యోగం లేదని, కుటుంబ భవిష్యత్ ఏంటో అర్ధం కావట్లేదని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. 120 మందికి పైగా ప్రాణాలను బలిగొన్న తన గ్రామానికి తిరిగి వెళ్లే ఆలోచన లేదని ఆమె స్పష్టం చేశారు. ఇళ్లు, పొలాలు తగలబడ్డాయని.. మణిపూర్ ప్రభుత్వం మే 3 న మొదటిసారి హింస మొదలైనపుడు నియంత్రించలేక పోయిందని ఆమె తప్పు పట్టారు. తనకు చాలా కోపంగా, ఆవేశంగా ఉందని.. ఇక నుంచి ఏం చేయాలో? ఎలా బ్రతకాలో అర్ధం కావట్లేదని ఆమె తీవ్ర ఆవేదనతో చెప్పారు.
ఇక ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో పోలీసులు ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్ చేశారు. కాగా, మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించిన సంగతి తెలిసిందే.
