లడఖ్‌లో చైనా దూకుడుకు దీటుగా బ‌దులిచ్చాం…మన్ కీ బాత్ లో మోడీ

  • Published By: venkaiahnaidu ,Published On : June 28, 2020 / 06:25 PM IST
లడఖ్‌లో చైనా దూకుడుకు దీటుగా బ‌దులిచ్చాం…మన్ కీ బాత్ లో మోడీ

Updated On : June 28, 2020 / 6:25 PM IST

సరిహద్దుల్లో చైనా దూకుడుకు దీటుగా బదులిచ్చామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.  గ‌ల్వాన్ వ్యాలీలో  చైనా బ‌ల‌గాల‌తో పోరాడి ప్రాణాలు కోల్పోయిన 20 మంది సైనికుల త్యాగాలను ప్ర‌ధాని కొనియాడారు. మనం సుఖంగా జీవించేందుకు వారు తమ ప్రాణాలను ఫ‌ణంగా పెట్టారన్నారు. ఆదివారం మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో మాట్లాడిన ప్ర‌ధాని ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ఈసారి మన్‌ కీ బాత్‌లో మోడీ పలికిన ఓ సంస్కృత శ్లోకంపై ఇప్పడు చర్చ నడుస్తోంది. “మన దేశంలో ఓ సామెత ఉంది… విద్య ధనం మదయ… శక్తి పర్షామ్ పరక్షిద్ ఖలశ్య సధోకా” అని మోడీ అన్నారు. చైనాను ఉద్దేశించే… ప్రధాని మోదీ ఆ సంస్కృత శ్లోకం చెప్పినట్లు తెలుస్తోంది.

ఆ శ్లోకం  అర్థాన్ని ప్రధాని మోడీ … హిందీలో వివరించారు. “ఓ వ్యక్తిలో చెడు స్వభావం ఉంటే… అతను తన విద్యను తెలివితేటల్నీ… వివాదాల కోసం, డబ్బు కోసం, స్వార్థం కోసం, ఇతరుల్ని నాశనం చేయడం కోసం వాడుతారు” అని తెలిపారు. భారత దేశం ఎప్పుడూ… ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని …. దేశ స్వాతంత్ర్యాన్ని, సార్వభౌమత్వాన్నీ కాపాడేందుకు తన సొంత శక్తిని వినియోగిస్తుంది అని మోడీ  తెలిపారు.

స్థానిక‌ ఉత్పత్తుల వాడకానికే దేశ ప్ర‌జ‌లు మొగ్గుచూపాలని ప్ర‌ధాని మోదీ కోరారు. సవాళ్లను అవకాశాలుగా మలుచుకుంటూ దేశం రక్షణ, సాంకేతిక రంగాల్లో బలోపేతమవుతున్న‌ద‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. ప్రపంచ శాంతి, అభివృద్ధి కోసం భారత్‌ పాటుపడుతున్న‌ద‌ని చెప్పారు. ప్ర‌పంచ దేశాల‌తోపాటు దేశంలోనూ క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న‌ద‌ని, క‌రోనా క‌ట్ట‌డి కోసం ప్ర‌తి ఒక్క‌ర‌ నియమాలను క‌చ్చితంగా పాటించాల‌ని, లేదంటే ప్రమాదంలో పడతామని ప్ర‌ధాని హెచ్చరించారు.

దేశ లక్ష్యం… ఇతరులకు సాయం చేయడం, సంప్రదాయాల్ని కాపాడటం, నమ్మకాన్ని కలగివుండటం, స్నేహ హస్తం చాటడం అని ప్రధాని తెలిపారు. సంబంధాల్ని కొనసాగించడమే భారత్ ఆలోచన అన్న మోడీ . ఇవే ఆదర్శ భావాలతో మనం ఉంటామని చెప్పారు. ప్రపంచం సమస్యల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం ద్వారా భారత్… శాంతి, అభివృద్ధిలో మరింత బలోపేతం అయ్యిందన్నారు.

భారత్ తన సరిహద్దుల్నీ, సార్వభౌమత్వాల్నీ కాపాడుకునేందుకు ఎంత శక్తిమంతమైనదో ప్రపంచం దేశాలకు తెలుసన్నారు మోడీ.  లడక్‌లో భారత గడ్డపై కన్నేసిన వారికి ఎలాంటి గతి పట్టిందో తెలుసన్నారు. ఇండియాకి స్నేహ హస్తం ఎలా చాటాలో తెలుసన్న ప్రధాని .. తగిన సమాధానం ఎలా చెప్పాలో కూడా తెలుసన్నారు. భారత సైనికులు… ఎట్టి పరిస్థితుల్లో భారత దేశ గౌరవం తగ్గే పరిస్థితి రానివ్వబోరని మోడీ తెలిపారు. జూన్ 15 నాటి చైనా-భారత్ ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులవ్వడంపై దేశంలోని ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతున్నారని, అమరులైన సైనికుల తల్లిదండ్రులు మరింత మందిని తమవారిని సైన్యంలోకి పంపేందుకు సిద్ధంగా ఉన్నారనీ… అది మన బలం అని మోడీ అన్నారు.