PM Modi: పాఠశాల పుట్టిన రోజు చాలా మంది విద్యార్థులకి తెలియదని, వాస్తవానికి అలా తెలియకపోవడం వల్ల పాఠశాలకు విద్యార్థులకు మధ్య దూరం పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) అన్నారు. శుక్రవారం ఆయన గుజరాత్(Gujarat)లో నిర్వహించిన అఖిల భారతీయ శిక్షా సంఘ్ అధివేషన్(Akhil Bhartiya Shiksha Sangh Adhiveshan)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. చాలా మందికి తమ పాఠశాల పుట్టినరోజు కానీ వ్యవస్థాపన రోజు కానీ గుర్తుండదని అన్నారు. పాఠశాలల పుట్టినరోజును జరుపుకునే సంప్రదాయాన్ని ప్రారంభించాలని ఆయన సూచించారు. ఒకసారి స్కూలు వదిలాక ఎప్పుడో ఉద్యోగ సమయంలోనో మరో సమయంలోనో ఫాం నింపాల్సి వచ్చినప్పుడే పాఠశాలను గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. పాఠశాలను గుర్తు పెట్టుకుని, పాఠశాల స్థాపన దినోత్సవం లాంటివి నిర్వహిస్తూ ఉంటే సమాజంలో విద్యాపరంగా మార్పు వస్తుందని, సమాజం సైతం చైతన్యవంతం అవుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.