CRPC రూల్స్ ఇక మరింత కఠినం.. అప్డేట్ అయిన ఐపీసీ సెక్షన్స్ .. వివరాలు ఇవిగో
ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో సరికొత్త చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్రం. స్వల్ప నేరాలకు పెట్టీ కేసులు వంటివాటిని ఇందులో మళ్లీ చేర్చారు.
- Naga Srinivasa Rao Poduri
- Published On : June 28, 2024 / 10:33 AM IST
New Criminal Laws Replacing IPC, CrPC and Evidence Act details
CrPC and Evidence Act: కాలం మారింది. కాలంతో పాటు నేరాలు జరిగే తీరు మారింది. కాకపోతే పాత కాలం నాటి చట్టాలకే కాలం చెల్లింది. ఇప్పుడు జరుగుతున్న నేరాలకు బ్రిటిష్ కాలం నాటి చట్టాల అమలుతో కఠిన శిక్షపడటం లేదు. అందుకే కొత్త చట్టాలను తీసుకొచ్చింది కేంద్రప్రభుత్వం. ఇప్పటివరకు అమలులో ఉన్న పాత చట్టాలు భారతీయ శిక్షాస్మృతి-1880, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్- 1872, క్రిమినల్ ప్రొసిజర్ కోడ్-1973 స్థానంలో కొత్త చట్టాలు తీసుకొచ్చేసింది. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అనే కొత్త చట్టాలు జూలై 1 నుంచి అమలు చేసేందుకు రెడీ అయింది కేంద్ర ప్రభుత్వం.
వంద ఏళ్ల కింద నాటి చట్టాలతో.. ఇప్పుడు జరుగుతోన్న నేరాలను కట్టడి చేయడం కష్టం. అందుకే పాత చట్టాలను సమూలంగా ప్రక్షాళన చేశారు. కొత్త చట్టాలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పలు మార్పులు, చేర్పులు చేశారు. అవసరం లేని పదాలను తొలగించారు. కొత్త చట్టాలతో నిబంధనలు, సెక్షన్లు మారాయి.
ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో సరికొత్త చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్రం. స్వల్ప నేరాలకు పెట్టీ కేసులు వంటివాటిని ఇందులో మళ్లీ చేర్చారు. మహిళలు, పిల్లలు, హత్య, రాజ్య వ్యతిరేక నేరాలపై శిక్షలను కఠినతరం చేసింది కేంద్రం. కొన్ని నేరాలకు స్త్రీ పురుషులనే తేడా లేకుండా సమానంగా శిక్ష పడేలా యాక్ట్ రూపొందించారు. ఆర్గనైజ్డ్ క్రైమ్స్, టెర్రరిస్ట్ యాక్టివిటీ, తీవ్రవాదానికి చెక్ పెట్టేందుకు శిక్షలను స్ట్రిక్ట్ చేశారు. సాయుధ తిరుగుబాటు, విధ్వంసం, వేర్పాటువాదం..లేదా దేశ సార్వభౌమత్వం, ఐక్యతకు భంగం కలిగించే యాక్టివిటీస్పై సీరియస్ యాక్షన్ తీసుకునేలా ఈ చట్టంలో అంశాలను చేర్చారు. కొన్ని నేరాలకు జరిమానాలు, శిక్షలను పొడిగించారు.
పాత కాలం నాటి చట్టాల్లో మార్పులు చేర్పులు చేసి..భారతీయ న్యాయ సంహిత-2023 పేరుతో లోక్సభలో గతడాది ఆగస్టు 11న ప్రభుత్వం ప్రవేశపెట్టింది. స్టాండింగ్ కమిటీ సిఫారసులను ఇందులో చేర్చి 2023 డిసెంబర్ 12న మళ్లీ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది ప్రభుత్వం. 2023, డిసెంబర్ 25న ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
ఇండియన్ పీనల్ కోడ్ IPCలోని చాలా అంశాలను భారతీయ న్యాయ సంహిత 2023లో కొనసాగించారు. ఇందులో సామాజిక సేవ అనే కొత్త శిక్షను చేర్చారు. భారత న్యాయ సంహితలో ఉగ్రవాదాన్ని నేరంగా పరిగణిస్తుంది. ప్రజలపై జరిపే ఉగ్రదాడులను కూడా ఇందులో చేర్చారు. కిడ్నాప్, బలవంతపు వసూళ్లు, క్రైమ్ సిండికేట్ కోసం చేసే సైబర్ నేరాలు, ఆర్గనైజ్డ్ క్రైమ్స్ భారత న్యాయ సంహిత పరిధిలోకి వస్తాయి. కులం, భాష లేదా వ్యక్తిగత గుర్తింపు కోసం ఐదుగురు లేక అంతకంటే ఎక్కువమందిని హత్య చేస్తే.. నిందితులకు జీవిత ఖైదు లేదా మరణశిక్ష పడే అవకాశం ఉంటుంది.
Also Read: లోక్సభలో జై పాలస్తీనా నినాదం.. కలకలం రేపిన అసదుద్దీన్ ఒవైసీ
నేరానికి సంబంధించి బాధ్యుడిని చేసే వయసును ఎప్పటిలానే ఏడేళ్లకు కొనసాగించారు. అయితే నేరానికి పాల్పడిన బాలుడి మానసిక పరిస్థితిని బట్టి ఈ వయసును 12ఏళ్ల వరకు పెంచవచ్చు. రేప్, గ్యాంగ్ రేప్ వంటి ఘటనల్లో వయోపరిమితిలో భిన్నంగా ఉన్నాయి. రేప్, లైంగిక వేధింపులకు సంబంధించి IPC చట్టంలోని నిబంధనలనే ఇందులో కొనసాగించారు.
Also Read: రాజకీయ సముద్రంలో ఎదురీది నిలబడ్డ రాహుల్.. తండ్రి, తల్లి తర్వాత అపోజిషన్ లీడర్గా యువనేత
దేశంలోని ఒక వర్గం ప్రజలపై దాడులకు పాల్పడటం కూడా..భారతీయ న్యాయ సంహితలో నేరంగానే పరిగణిస్తారు. ఓ వర్గంపై దాడుల్లో ఓ వ్యక్తి చనిపోతే అందుకు కారణమైనవారికి జీవితఖైదు లేదా మరణశిక్ష, ఫైన్ పడనుంది. నేర తీవ్రతను శిక్షలను కఠినతరం చేసింది కేంద్రం. ఒక వ్యక్తి మరణానికి కారణమైతే రూ.10లక్షల వరకు జరిమానాతో పాటు మరణశిక్ష లేదా జీవితఖైదు వేసేలా చట్టాల్లో మార్పులు తెచ్చారు.
