దేశ వ్యాప్తంగా నేరాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.కానీ హర్యానాలోని ఓ గ్రామంలో గత 50 సంవత్సరాల నుంచి ఒక్కటంటే ఒక్క పోలీస్ కేసు కూడా నమోదు కాలేదు. అంటే అక్కడ నేరాలు జరగవని కాదు. అయినా సరే ఎటువంటి నేరం జరిగినా ఆ గ్రామస్తులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను పోలీస్ స్టేషన్ దరిదాపులకు కూడా వెళ్లరు. ఆ గ్రామం పేరు జీంద్ జిల్లాలోని రోజ్ ఖెడా గ్రామం.
దేశరాజధాని ఢిల్లీకి ఆనుకుని జింద్-నార్వానా జాతీయ రహదారిపై బరోడా గ్రామం నుండి నాగురాన్ వెళ్లే లింక్ రహదారిపై రోజ్ ఖెడా గ్రామం ఉంది. జనాభా పరంగా ఈ గ్రామం చాలా చిన్నది. రోజ్ఖెడా గ్రామస్తులు గొడవలు జరిగినపుడు పోలీస్ స్టేషన్కు వెళ్లరు. పంచాయతీ పెద్దలే ఆ సమస్యను పరిష్కరిస్తారు. గడచిన 50 ఏళ్లలో ఈ గ్రామం నుంచి ఒక్క పోలీసు కేసు కూడా నమోదుకాకపోవడం విశేషం.
కష్టసుఖాలన్నీ అన్ని కులాలవారు కలిసే పంచుకుంటారు
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రణధీర్ సింగ్ మాట్లాడుతూ గ్రామంలో గొడవలు జరిగినప్పటికీ, ఎవరూ పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లరు. పంచాయతీ సమక్షంలోనే వాటికి పరిష్కరించుకుంటామని తెలిపారు. గ్రామంలో జాట్ కులస్తులతో పాటు ముస్లిములు, వాల్మీకి కులస్తులు కూడా ఉన్నారు. వీరంతా సహోదర భావంతో మెలుగుతుంటారు. కష్టసుఖాలు..మంచీ చెడులన్నీన కలిసే పంచుకుంటారు. ఏదైనా సమస్యలపై పోలీస్ స్టేషన్ కు వెళ్లినట్లుగా లేదని ఓ వృద్ధుడు తెలిపాడు.
అక్షరాస్యతలో ముందున్న రోజ్ ఖెడా గ్రామం
రోజ్ ఖెడా గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ తో పాటు చిన్నారుల కోసం అంగన్వాడీ కేంద్రం కూడా ఉంది.గ్రామానికి చెందిన యువకుడు సోనూ మాట్లాడుతూ గ్రామం అక్షరాస్యత విషయంలోనూ ముందుందని మాది చిన్న గ్రామమైనా అక్షరాస్యత విషయంలో ముందుందని..మా ఊరినుంచి ఏడుగురు యువకులు భారత ఆర్మీలో సేవలు చేస్తున్నారనీ..మరో ఏడుగురు యువకులు పోలీస్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్నారనీ తెలిపారు. మా గ్రామంలో గొడవలు జరిగినా ఎవ్వరిమీదా కూడా ఇప్పటి వరకూ ఎటువంటి క్రిమినల్ కేసులు లేవనీ..ఇతర గ్రామాలు మా గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని సోదరభావంతో మెలగాలని సూచించారు.