Upsc K
UPSC Extra Attempt : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అభ్యర్ధుల వయోపరిమితి, నిర్ణీత అటెంప్ట్స్ పెంచే అంశం గురించి కేంద్రం క్లారిటీ ఇచ్చింది. సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల వయో పరిమితి, నిర్ణీత అటెంప్ట్స్ పెంచే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు తెలిపారు. కరోనా కారణంగా పలువురు అభ్యర్థులు వయోపరిమితి, అటెంప్ట్స్ పెంపు కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానం జారీ చేసిన గత తీర్పులను పరిశీలించిన తర్వాత సివిల్ సర్వీసెస్ నిబంధనల్లో మార్పు సాధ్యం కాదని కేంద్రమంత్రి వెల్లడించారు.
కోవిడ్ మహమ్మారి నేపధ్యంలో 2020లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు అదనపు అటెంప్స్ట్కు అవకాశం కల్పించవలసిందిగా సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని కోరిందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు.
‘కోవిడ్ కారణంగా సివిల్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు వయోపరిమితి, నిర్ణీత అటెంప్ట్స్ విషయంలో సడలింపు ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కొందరు సివిల్స్ ఆశావహ అభ్యర్ధులు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు జారీ చేసిన తీర్పులను పరిశీలించిన అనంతరం అభ్యర్ధుల వయోపరిమితి సడలింపు, అదనపు అటెంప్ట్స్కు అవకాశం కల్పించేలా నిబంధనల్లో మార్పు తీసుకురావడం సాధ్యం కాదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సివిల్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు సడలింపులు ఇచ్చే ప్రతిపాదనేదీ ప్రభుత్వం దగ్గర లేదు’ అని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీస్ పరీక్ష-2022 సంవత్సరానికి నోటిఫికేషన్ను ఈ నెల 3న విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా యూపీఎస్సీ వివిధ సివిల్ సర్వీసుల (IAS, IPS)కు చెందిన మొత్తం 861 ఖాళీలను భర్తీ చేయనుంది. ఫిబ్రవరి 22వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.