2012 డిసెంబరు 16న 23ఏళ్ల నిర్భయను అత్యాచారం చేసిన నలుగురిపై రేపు(డిసెంబరు 13)న విచారణ జరగనుంది. పాటియాలా కోర్టు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. తీహార్ జైలు అధికారులు ప్రత్యేక భద్రతలతో వారిని హాజరుపరచనున్నారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన దిశ ఉదంతం దేశ వ్యాప్తంగా కలిచివేసింది.
ఈ క్రమంలో నిర్భయ హంతకుల్ని కోర్టుకు తీసుకెళ్లేటప్పుడు ప్రజల ఆందోళనతో ప్రాణహాని కాబట్టి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. దిశ ఘటనకు ముందే మరో సారి నిర్భయ తల్లి కోర్టును ఆశ్రయించారు. ట్రయల్ కోర్టు, సుప్రీం కోర్టు ఉరిశిక్ష వేసినా ఇంకా అమలుకాలేదని నిర్భయ తల్లి ఆశాదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన కూతురు పడిన శారీరక..మానసిక వేదనకు తగిన న్యాయం జరిగేలా నిర్భయ దోషులకు విధించిన ఉరిశిక్షను నిర్ణయించిన డిసెంబర్ 16నే వారిని ఉరి తీయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు నిందితులు.
రామ్ సింగ్ అనే ఒకరు తీహార్ జైల్లో 2013 మార్చిలో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత విడుదలయ్యాడు. మిగిలిన నలుగురు నిందితులు అక్షయ్, వినయ్ శర్మ, పవన్, ముఖేశ్లకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది.