రాజస్థాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ (87) చిక్కుల్లో పడ్డారు. ఆయనను గవర్నర్ పదవి నుంచి తొలగించే అవకాశం ఉంది.
ఢిల్లీ : రాజస్థాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ (87) చిక్కుల్లో పడ్డారు. ఆయనను గవర్నర్ పదవి నుంచి తొలగించే అవకాశం ఉంది. ‘నేను బీజేపీ కార్యకర్తనే…మోడీ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నా’ అని కళ్యాణ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సీరియస్ అయ్యారు. కళ్యాణ్ సింగ్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కేంద్ర ఎన్నికల సంఘం సమర్పించిన నివేదికను రాష్ట్రపతి గురువారం కేంద్ర హోంశాఖకు పంపారు. కళ్యాణ్ సింగ్ వ్యాఖ్యలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని హోంశాఖకు సూచన చేశారు. ఈసీ ఫిర్యాదుపై రాష్ట్రపతి స్పందించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధ పదవుల్లోనివారు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం సరికాదన్నారు.
Read Also : ఎన్నికల తర్వాత మోడీ జైలుకు: రాహుల్ గాంధీ
గత నెల 25న యూపీలోని అలీగఢ్లో జరిగిన ఓ కార్యక్రమంలో కళ్యాణ్ సింగ్ మాట్లాడుతూ.. ‘మనమంతా బీజేపీ కార్యకర్తలం. కాబట్టి మళ్లీ బీజేపీనే అధికారంలోకి రావాలని కోరుకుంటాం. దేశ ప్రయోజనాల దృష్ట్యా మోదీ మళ్లీ ప్రధాని కావాల్సిన అవసరముంది. మే 23న మోదీ మళ్లీ ప్రధాని కావాలని మేమంతా కోరుకుంటున్నాం. దేశంలోని ప్రతీ బీజేపీ కార్యకర్త పార్టీ విజయానికి కృషి చేయాలి’ అని చెప్పారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్గా మారడంతో విచారణ జరిపిన ఈసీ.. కళ్యాణ్ సింగ్ ఎన్నికల నియమావళితో పాటు గవర్నర్ పదవికి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించారని తేల్చింది. ఈ నివేదికను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు సమర్పించింది. విదేశీ పర్యటన నుంచి బుధవారం భారత్కు చేరుకున్న కోవింద్.. కళ్యాణ్ సింగ్పై చర్యలు తీసుకోవాలంటూ నివేదికను హోంశాఖకు పంపారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు చర్యలు ఎదుర్కొని, దేశ చరిత్రలో ఈసీ ఫిర్యాదుపై తొలగింపబడ్డ తొలి గవర్నర్ కళ్యాణ్ సింగ్ కానున్నారు.
1990లో హిమాచల్ప్రదేశ్ గవర్నర్గా వ్యవహరించిన గుల్షర్ అహ్మద్ తన కుమారుడి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీంతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని అన్నివైపుల నుంచి విమర్శలు రావడంతో అహ్మద్ తన పదవికి రాజీనామా చేశారు. 1992, డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో కళ్యాణ్ సింగ్ యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. బీజేపీ అగ్రనేతలతో పొసగకపోవడంతో 1999లో పార్టీకి రాజీనామా చేసిన కళ్యాణ్ సింగ్..తిరిగి 2004లో బీజేపీలో చేరారు. 2014లో మోడీ ప్రధానిగా ఎన్నికయ్యాక కేంద్ర ప్రభుత్వం కళ్యాణ్ సింగ్ను రాజస్థాన్ గవర్నర్గా నియమించింది.
Read Also : విప్రోలో పాకిస్తాన్ షేర్లు అమ్మిన కేంద్రం