Rahul Gandhi: అగ్నిపథ్ పథకంపై మరోసారి మండిపడ్డ రాహుల్.. మోదీని ఏమన్నారంటే..
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న అగ్నిపథ్ పథకంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి మండిపడ్డారు. అగ్నిపథ్ పథకం వల్ల దేశంలోని యువత భవిష్యత్తు తో పాటు దేశ భద్రతకు కూడా ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు. ఈ మేరకు రాహుల్ ట్విటర్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీకి ఓ ప్రశ్నను సంధించారు.
- Harishth Thanniru
- Published On : July 24, 2022 / 04:19 PM IST
Rahul Gandhi
Rahul Gandhi: ఆర్మీలోని పలు విభాగాల్లో పనిచేసేందుకు యువతకు అవకాశం కల్పించేలా కేంద్రం అగ్నిపథ్ పథకాన్ని(Agnipath scheme) తీసుకొచ్చింది. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. అయినా కేంద్రం ఈ పథకం కొనసాగింపులో ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. తాజాగా అగ్నిపథ్ పథకంపై యువతలో నెలకొన్న సందేహాలపై పార్లమెంట్ లో చర్చ జరపాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కేంద్రం ప్రభుత్వం తీరుపై, అగ్నిపథ్ పథకంపై పలు విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘ పరిశోధన కేంద్రం’లో చేపట్టే ఈ నూతన ప్రయోగం వల్ల దేశ భద్రతతో పాటు యువత భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతోందని ఆరోపించారు.
రాహల్ గాంధీ ట్విటర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీని సూటిగా ప్రశ్నించారు. ప్రతి సంవత్సరం 60,000 మంది సైనికులు పదవీ విరమణ చేయగా, వారిలో 3000 మంది మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారు. మీరు ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం కింద నాలుగేళ్లు కాంట్రాక్టులపై ఆర్మీలోని పలు విభాగాల్లో పనిచేసి పదవీ విరమణ చేసే వేలాది మంది అగ్నివీరు(Agniveers)లకు భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటూ రాహుల్ ప్రశ్నించారు. ప్రధాని ప్రయోగశాలలో చేస్తోన్న ఈ నూతన ప్రయోగంతో దేశంలోని యువత భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడిందని రాహల్ గాంధీ విమర్శించారు.
60,000 सैनिक हर साल रिटायर होते हैं, उनमें से सिर्फ 3000 को सरकारी नौकरी मिल रही है।
4 साल के ठेके पर हज़ारों की संख्या में रिटायर होने वाले अग्निवीरों का भविष्य क्या होगा?
प्रधानमंत्री की प्रयोगशाला के इस नए Experiment से देश की सुरक्षा और युवाओं का भविष्य दोनों खतरे में हैं।
— Rahul Gandhi (@RahulGandhi) July 24, 2022
అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాటి నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఆందోళనలు హింసాత్మకంగానూ మారాయి. ప్రతిపక్షాలుసైతం ఏకతాటిపైకి వచ్చి ఈ పథకంపై కేంద్రం వెనక్కు తగ్గాలని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా పార్లమెంట్ లో అగ్నిపథ్ పథకంపై చర్చించాలని, యువతలో ఉన్న సందేహాలను కేంద్రం పార్లమెంట్ వేదికగా నివృత్తి చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.
