Right To Sleep : మీ నిద్రకు ఎవరైనా భంగం కలిగిస్తే వారిపై కేసు పెట్టొచ్చు అని తెలుసా..?
ప్రతీ మనిషికి ప్రశాంతంగా నిద్రపోయే హక్కు ఉంది. నిద్రకు భంగం కలిగించే హక్కు ఎవ్వరికి లేదు. ఒకవేళ మీ నిద్రకు ఎవరైనా భంగం కలిగిస్తే కేసు పెట్టే హక్కు కూడా ఉందని మీకు తెలుసా..?
- nagamani
- Published On : August 11, 2023 / 03:35 PM IST
Sleep disturbing..file case
Sleep disturbing..file case : మనిషి జీవించటానికి ఆహారం ఎంత ముఖ్యమో..ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర కూడా అంతే ముఖ్యం. రోజుకు కచ్చితంగా ఎనిమిది గంటలపాటు నిద్రపోవాలని లేదంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతుంటారు. రోజుకు 24గంటల్లో పని చేయటం ఆహారం తీసుకోవటంతో పాటు నిద్ర కూడా భాగమే. రోజంతా పనిచేసి అలసిపోయిన శరీరానాకి విశ్రాంతి అవసరం. నిద్ర ద్వారానే శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. అలా నిద్ర ప్రతీ మనషి హక్కు. భారతదేశంలో నిద్రించే హక్కు ప్రాథమిక హక్కుగా గుర్తించబడింది. ప్రశాంతంగా నిద్రపోయే హక్కు ప్రతీ మనిషికి ఉంది. అలాకాదని నిద్రకు భంగం కలిగిస్తే నేరం అని చాలామందికి తెలియదు.
భారతదేశంలో నిద్రించే హక్కు ప్రాథమిక హక్కుగా గుర్తించబడింది. అంటే ‘జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ’కు హామీ ఇచ్చే భారత రాజ్యాంగం(Constitution of India)లోని ఆర్టికల్ 21(Article 21) ప్రకారం ప్రతి పౌరుడికి ఎలాంటి భంగం లేకుండా ప్రశాంతంగా నిద్రపోయే హక్కు ఉంది. 2012లో ఢిల్లీలో బాబా రామ్దేవ్ ర్యాలీ సందర్భంగా, నిద్రిస్తున్న వ్యక్తులపై పోలీసు చర్యకు సంబంధించిన కేసులో భారత సుప్రీంకోర్టు నిద్ర యొక్క ప్రాముఖ్యతను ప్రాథమిక హక్కుగా సమర్థించింది. నిద్రను దూరం చేయడం వారి ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమేనని కోర్టు తీర్పునిచ్చింది. మానవ ఉనికికి, మనుగడకు అవసరమైన సున్నితమైన ఆరోగ్య సమతుల్యతను కాపాడుకోవడానికి నిద్ర చాలా కీలకమని కోర్టు స్పష్టం చేసింది.
Jayaprada : నటి, మాజీ ఎంపీ జయప్రదకు ఆరు నెలలు జైలు శిక్ష ..
కాబట్టి నిద్ర అనేది ఒక ప్రాథమిక మానవ అవసరంగా పరిగణించబడుతుంది. నిద్ర లేకపోతే అనేకమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సయ్యద్ మక్సూద్ అలీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా నిద్ర ప్రాముఖ్యాన్ని ప్రాథమిక హక్కుగా ఎత్తిచూపింది. మంచి వాతావరణంలో జీవించడంతోపాటు రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోయే హక్కు ప్రతి పౌరుడికి ఉందని పేర్కొంది.
మనిషికి సరైన నిద్ర, ప్రశాంత జీవనం ప్రతీ ఒక్కరి హక్కు. అలా వ్యక్తి నిద్రకు భంగం కలిగించే హక్కు ఎవ్వరికీ లేదు. అలా చేస్తే నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. ఈ హక్కును కాపాడేందుకు అధికారులు, వ్యక్తులు ఇతరుల నిద్రకు భంగం కలిగించకూడదు. శాంతియుత విశ్రాంతిని ప్రోత్సహించే వాతావరణాన్ని సృష్టించడం అనేది కేవలం సౌలభ్యం మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన, సంతోషకరమైన సమాజానికి దోహదపడే ప్రాథమిక హక్కు అని అందరూ తెలుసుకోవాలి.
మనిషికి నిద్ర చాలా ముఖ్యం. నిద్రకు చాలాసార్లు భంగం కలగుతుంటుంది. అది స్థానికుల వల్ల కావచ్చు..స్థానికంగా కొంతమంది చేసే ధ్వని వల్ల కావచ్చు. ఉదాహరణకు గట్టిగా అరవటం, కేకలు వేయటం, మైక్ సెట్లు పెట్టటం,డీజేవంటివి పెట్టటం ఇలా తోటి వ్యక్తుల నిద్రకు భంగం కలిగించే హక్కు ఎవ్వరికి లేదు. నిద్రకు భంగం కలిగించే వారిపై కేసు కూడా ఫైల్ చేయవచ్చని మీకు తెలుసా..?తెలియకపోతే తెలుసుకోండి..మీ నిద్ర హక్కును కాపాడుకోండి..
సరైన నిద్ర, శాంతికంగా జీవించటం ప్రతీ ఒక్కరి హక్కు. ప్రతి ఒక్కరికీ శాంతియుతమైన విశ్రాంతిని ప్రోత్సహించే వాతావరణాన్ని సృష్టించడం అనేది కంఫర్ట్ మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన సమాజానికి దోహదపడే ప్రాథమిక హక్కు అని తెలుసుకోవాలి.
